కామారెడ్డి టౌన్, సెప్టెంబర్ 25: వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు వానకాలం పంటల వివరాలను నమోదు చేయడంతో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు.సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శనివారం ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు సమష్టిగా కృషిచేసి జిల్లాను మొదటి స్థానంలో నిలిపినందున వారిని అభినందించారు. వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించడానికి వ్యవసాయ విస్తీర్ణ అధికారులు రైతు వేదికలో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గోధుమ, పొద్దుతిరుగుడు, పెసర, మినుము, చెరుకు, వేరు శనగ వంటి పంటలు వేసేలా ప్రోత్సహించాలన్నారు. ఏరువాక శాస్త్రవేత్త డాక్టర్ మురళి మాట్లాడుతూ.. యాసంగిలో అనుకూలమైన ఆరుతడి పంటలు వేయాలని సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూర్ శాస్త్రవేత్తలు డాక్టర్ నవీన్ కుమార్, డాక్టర్ సురేశ్ మాట్లాడారు. నేల స్వభావాన్ని బట్టి పంటలు సాగు చేసే విధానాన్ని తెలియజేశారు. ఉద్యాన శాస్త్రవేత్తలు రాజ్కుమార్ మాట్లాడుతూ.. రైతులు ఆయిల్ పామ్ పంటలను సాగు చేసేలా చూడాలన్నారు. ఉద్యాన పంటలు సాగు చేస్తే అధిక ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారిణి భాగ్యలక్ష్మి, ఏడీఏలు రత్నం, చంద్రశేఖర్, ఆంజనేయులు, శశిధర్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.