వైద్యరంగానికి రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. కార్పొరేట్కు దీటుగా సర్కారు దవాఖానల రూపురేఖల్ని మారుస్తున్నది. వైద్య సదుపాయాల మెరుగుదలకు ప్రభుత్వ చర్యలకుతోడు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో బాన్సువాడలో వందపడకల మాతాశిశు ఆరోగ్యకేంద్రం అందుబాటులోకి వచ్చింది. అత్యవసర సమయాల్లో అవసరమయ్యే రక్తం కోసం ఈ కేంద్రం పక్కనే కోటి రూపాయలతో రక్తనిధి కేంద్రం ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ కోసం ఏరియా దవాఖానలో ప్లాంటును సైతం ఏర్పాటు చేశారు. ఏరియా దవాఖానలో సకల సౌకర్యాలను కల్పిస్తుండడంతో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది.
బాన్సువాడ, సెప్టెంబర్ 24బాన్సువాడ, సెప్టెంబర్ 24: సమైక్య పాలనలో సరైన వైద్య సదుపాయాలు, వసతులు లేక పోవడంతో ‘నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు’ అ న్న చందంగా దవాఖానల పరిస్థితులు ఉండేవి. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో సర్కార్ దవాఖానలు సకల వసతులతో, అధునాతన వైద్య పరికరాతో కార్పొరేట్ వైద్యశాలలకు ఏమాత్రం తీసిపోకుండా వైద్య సేవలు అందిస్తున్నాయి. బాన్సువాడలో 1999లో నిర్మించిన వంద పడకల దవాఖానలో నిత్యం సుమారు వెయ్యి నుంచి 1500 వర కు రోగులు వైద్యం కోసం వస్తుంటారు. ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టడం, సుఖ ప్రసవాల శాతం పెరగడంతో దవాఖానలకు వచ్చే గర్భిణుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పెరుగుతున్న రద్దీ ని దృష్టిలో పెట్టుకుని స్పీకర్ పోచారం శ్రీనివాస రె డ్డి ప్రత్యేక దృష్టి సారించి అధునాతన పరికరాలను ఏర్పాటు చేయించారు. దవాఖానకు అనుసంధానంగా తల్లీబిడ్డల సంరక్షణే ధ్యేయంగా బాన్సువాడలోనే రూ.20 కోట్లతో వంద పడకల మాతా శిశు దవాఖాన మంజూరు చేయించారు. బాన్సువాడ దవాఖానలోఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేయించారు.
అందుబాటులోకి వంద పడకల ఎంసీహెచ్ దవాఖాన
కామారెడ్డి జిల్లా కేంద్రానికి సుమారు 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న బాన్సువాడ డివిజన్ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన వంద పడకల మాతాశిశు దవాఖాన శరవేగంగా పనులు పూర్తి చేసుకుని అందుబాటులోకి వచ్చింది. దవాఖాన ఎదుట ఉన్న ఐడీసీఎంఎస్ గోదాం స్థలంలో దవాఖానను నిర్మించారు. ఈ నెల 3 తేదీన స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్తో కలిసి ప్రారంభించారు. మారుమూల ప్రాంతాలైన నారాయణ ఖేడ్, ఎల్లారెడ్డి, బీర్కూర్, జుక్కల్, నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్గల్, నస్రుల్లాబాద్, లింగంపేట్, తాడ్వాయి, గాంధారి, నాగిరెడ్డిపేట్ తదితర ప్రాంతాల నుంచి ప్రసవాల కోసం వచ్చే ఆడబిడ్డలకు దవాఖాన వరంలా మారింది.
కార్పొరేట్కు దీటుగా వైద్య సేవలు
బాన్సువాడలో నిర్మించిన జనరల్ దవాఖానలో అధునాతన వైద్యపరికరాలు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమయ్యే వెంటిలేటర్లు, వంద పడకలకు ఒకేసారి ఆక్సిజన్ అందేలా పైపులైన్ ఏర్పాటు, అల్ట్రాసౌండ్, ప్రీఆర్మ్ మిషన్ (ఆర్థోపెడిక్ ), ఆపరేషన్ థియేటర్ అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. నూతనంగా నిర్మించిన ఎంసీహెచ్ దవాఖానలో ప్రసూతి సమయంలో హైరిస్కు కేసులు వచ్చినా ఆపరేషన్లు సైతం నిర్వహించేలా అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేశారు. పుట్టిన బిడ్డలకు ఇబ్బంది లేకుండా రెండు వెంటిలేటర్లను అందుబాటులో ఉంచారు. అంతే కాకుండా ఆక్సిజన్ కోసం అత్యవసర పరిస్థితుల్లో ఎటూ వెళ్లే అవసరం లేకుండా బాన్సువాడ దవాఖానలో 500 పీఎస్ఏ కెపాసిటీ గల ప్లాంట్ను ఏర్పాటు చేశారు. బాన్సువాడ దవాఖానలో మరో పది పడకల ఐసీయూ కేర్ సెంటర్ సిద్ధమవుతున్నది. అత్యవసర సమయాల్లో అవసరమయ్యే రక్తం కోసం మాతాశిశు సంరక్షణ కేంద్రం పక్కనే కోటి రూపాయలతో రక్తనిధి కేంద్రం ఏర్పాటు చేశారు. కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులకు ఉచితంగా వైద్యం అందేలా కోటి రూపాయలతో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశారు.
దవాఖానల్లో అన్ని సౌకర్యాలు
బాన్సువాడ ఏరియా దవాఖానలో సకల సౌకర్యాలు ఉన్నాయి. కేసీఆర్ కిట్తో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ కోసం ఎక్కడికీ వెళ్లే అవసరం లేకుండానే దవాఖానలో ప్లాంటు ఏర్పాటు చేశాం. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కృషితోనే బాన్సువాడ దవాఖానలో నిరుపేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందుతున్నది. కోట్లాది రూపాయలతో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు అయ్యాయి.
డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, బాన్సువాడ ఏరియా దవాఖాన సూపరింటెండెంట్