బంజారాహిల్స్ : పేదింటి ఆడబిడ్డలకు ఆసరాగా నిలిచేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు సమర్థవంతంగా అమలు చేస్తోందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
షేక్పేట మండల కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరయిన చెక్కులను ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్లు మన్నె కవితారెడ్డి, వెల్దండ వెంకటేష్ పంపిణీ చేశారు. వెంకటేశ్వరకాలనీ, జూబ్లీహిల్స్ డివిజన్ల పరిధిలో నివాసం ఉంటున్న 22మంది లబ్దిదారులకు చెక్కులను అందజేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. పేదరికంతో బాధపడుతూ ఆడపిల్లల పెండ్లి అంటే ఆందోళన పడే కుటుంబాల ఇబ్బందులను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు.
ఈ పథకం వచ్చిన తర్వాత ఆడపిల్లల పెండ్లి అంటే బరువు అనే భావన మారిపోయిందన్నారు. దీంతో పాటు సీఎం కేసీఆర్ రూపొందించిన ఆసరా, కేసీఆర్ కిట్స్ తదితర పథకాలన్నీ పేదలకు ఎంతో సాయపడుతున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో షేక్పేట మండల తహసీల్దార్ కే.శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మామిడి నర్సింగరావు, వెంకటేశ్వరకాలనీ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రాములు హాన్, ప్రధాన కార్యదర్శి మాదాస్ ఆనంద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.