చిలిపిచెడ్, జనవరి 21 : మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చిట్కుల్ గ్రామ శివారులో మంజీరా నది తీరాన వెలిసిన చాముండేశ్వరీ అమ్మవారు భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. చాముండేశ్వరీ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. దేశంలోని రెండో అతిపెద్ద ఆలయం ఇది. 1979లో అమ్మవారి భక్తుడు కుళాచార్య బ్రహ్మశ్రీ వెంకటరమణయ్య ఇక్కడ స్థలాన్ని శుద్ధిచేసి ఆలయ నిర్మాణానికి పునాది వేశారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి నుంచి ఉత్తమ శిలలను తెప్పించి తమిళ శిల్ప కళాకారులతో 9 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని తన పర్యవేక్షణలో చెక్కించారు. పద్దెనిమిది చేతులతో జ్వాలా కిరీటంతో వెలుగొందుతున్న అమ్మవారు, ఆకర్షణీయంగా భక్తులకు కనువిందు చేస్తూ కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కల్పవృక్షంగా మారారు. సాధారణంగా దేవాలయం పూర్తిగా నిర్మించిన తర్వాత విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. కానీ, ఇక్కడ ఒక తిన్నెపై ప్రతిష్ఠించి తర్వాత ఆలయ నిర్మాణం చేపట్టి ఇతర సౌకర్యాలు కల్పించారు. ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతున్నది. అమ్మవారిని భక్తులు నిండు మనసుతో తలచుకొని మంజీరా నదిలో మునిగి తుడుచుకోకుండా ఆవే తడిబట్టలతో శక్తి కొలది ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పశ్చిమాభిముఖంగా ఉన్న అమ్మవారికి ఎదురుగా బ్రాహ్మి, వైష్ణవి, కాళీదేవతా విగ్రహాలు ఉన్నాయి. గర్భగుడిలో అమ్మవారికి ఒకవైపు మహిషాసురుడు, ఇంకోవైపు సింహం ముఖాకృతిలో కొలువుదీరాయి. దేవతలకు ప్రతి శుక్రవారం ఉదయం 5 గంటలకు జలాభిషేకం నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాల ప్రారంభం రోజు, మూడు రోజులపాటు జరిగే వార్షికోత్సవాల మొదటి రోజు మా త్రమే ఆలయ వేదపండితుల ఆధ్వర్యంలో ఉద యం 10గంటలకు మంజీరా నదిలో నుంచి కుమ్మరి వారు తయారుచేసే కొత్త కుండలో మాత్రమే భక్తులు తీసుకు వచ్చిన నీటితో అమ్మవారికి జలాభిషేకం చేస్తారు. ఏడాదిలో ఈ రెండు రోజుల్లో వచ్చిన భక్తులకు జలాభిషేకంలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తారు. మంజీరా నదిలో జల గలగలలు.. చుట్టూ ఇసుక తిన్నెలు.. పచ్చని చెట్లు.. ప్రశాంత వాతావరణం ఆలయ పరిసరాల్లో కనిపిస్తుంది. నిత్యం దూపదీప నైవేద్యాలు, భక్తుల కుం కుమార్చనలు నిర్వహిస్తారు. భక్తులు ఒడిబియ్యం పోయడంతో పాటు పర్వదినాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మూడు రోజుల పాటు వార్షికోత్సవాలు..
చాముండేశ్వరీ అమ్మవారికి స్వస్తిశ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సర పుష్య బహుళ పంచమి శనివారం 22 జనవరి 2022 నుంచి బహుళ సప్తమి సోమవారం తేదీ 24 జవనరి 2022 వరకు త్య్రాహ్నిక దీక్షతో కలశ స్థాపనాది మహాహోమం జరుపుతారు. ఈ మూడు రోజుల పాటు ఆలయ 39వ వార్షికోత్సవాలు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి అమ్మవారికి సంపూర్ణ మహా జలాభిషేకంతో వార్షికోత్సవాలు ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. మూడు రోజుల పాటు ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు జపాలు, పారాయణాలు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు మహాపూజ, మహానివేదన, హారతి, తీర్థప్రసాద వితరణ ఉంటుందని చాముండేశ్వరీ సేవా సమితి, శక్తి మండల సభ్యులు, ప్రధాన పూజారి ప్రభాకర్శర్మ తెలిపారు.