మల్లాపూర్, జనవరి 19: నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని రైతులందరికి మోసపూరితమైన హమీలను ఇచ్చి ఎంపీగా గెలుపొందిన అర్వింద్కు రానున్న రోజుల్లో రైతులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. బుధవారం జగిత్యా జిల్లా మండలంలోని ముత్యంపేట చక్కెర కర్మాగారం ఆవరణలో ఎంపీ అర్వింద్ పర్యటించిన స్థలాన్ని టీఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో గోదావరి నీటిలో పాలనుకలిపి చల్లి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ గౌరు నాగేశ్ మాట్లాడుతూ ఇప్పటికే ఎంపీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హమీల అమలులో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వం తనకు అప్పగిస్తే తానే కొనుగోలు చేసి కర్మాగారాన్ని తెరిపిస్తానని చెప్పడం సరికాదని, నెల రోజుల్లో కర్మాగారాన్ని తెరిపిస్తే పార్టీలకతీతంగా తామే కర్మాగారం ఎదుట ఎంపీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తామని నాగేశ్ పేర్కొన్నా రు. కోరుట్ల నియోజకవర్గంలోని రైతులందరికీ ఎంపీ అర్వింద్ క్షమాపణ చెప్పిన తర్వాతే నియోజకర్గంలో పర్యటించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చింతల రమేశ్, నాయకులు దౌడె గంగనర్సయ్య, పవన్, గంగారం, విజయ్, రంజిత్, రమేశ్, రాజం, సందీప్, నవీన్, సాగర్, కొండయ్య, సాయి, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.