మారేడ్పల్లి : ఈశ్వరీబాయి జయంతి, వర్థంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఎంతో అభినంద నీయమని మాజీ మంత్రి జె. గీతారెడ్డి అన్నారు . రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే ఈశ్వరీబాయి 103వ జయంతిని పురస్కరించుకొని బుధవారం మారేడ్పల్లి సెయింట్ జాన్స్ చర్చి చౌరస్తాలోని ఈశ్వరీబాయి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గీతారెడ్డి మాట్లాడుతూ…ఈశ్వరీబాయి దళితుల అభ్యున్నతికి, మహిళ సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర కోసం అనే ఉద్యమాలు చేసిందన్నారు. కార్పొరేటర్గా రెండు పర్యాయాలు, ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిందన్నారు.
తన తల్లి చేసిన సేవలను సీఎం కేసీఆర్ గుర్తించి జయంతి, వర్థంతి వేడుకలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. ఆమే స్పూర్తితో ఈశ్వరీబాయి నర్సింగ్ కళాశాలను నెలకొల్పి వేలాది మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్చైర్మన్ డాక్టర్ డి. రాంచంద్రారెడ్డి, గీతా నర్సింగ్ హోం అడ్మినిస్టేటర్ మేఘనారెడ్డి, దళిత సంఘాల నాయకులు రావుల అంజయ్య, దయానంద్, హరికృష్ణ, శివకుమార్, నంది కంటి సాయి కుమార్, మాజీ కార్పొరేటర్ ఎంఆర్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.