చాదర్ఘాట్ :ఆజంపురా డివిజన్లోని పర్వత్నగర్లో శ్రీ పిలక్మాతా(శ్రీ శీతలాదేవీ) సహిత శ్రీ శివ పంచాయతన శ్రీ గణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవాలయ అధ్యక్షుడు ఎ.పరశురాం తెలిపారు. మంగళవారం నుంచి గురువారం వరకు పిలకమాత విగ్రహ పునఃప్రతిష్టాపన జరుగుతుందని పేర్కొన్నారు. కాగా విగ్రహ పునఃప్రతిష్టాపన మహోత్సవానికి రావల్సిందిగా ఆహ్వానిస్తూ టీఆర్ఎస్ పార్టీ నేతలు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీకి ఆహ్వాన పత్రికను అందజేశారు.
మంగళవారం నుంచి బుధవారం వరకు ప్రత్యేక పూజలు, చండీ హోమం ఉంటాయని, గురువారం ఉదయం శ్రీ గణపతి పూజ గర్త సంస్కారము, ఆవాహిత దేవతారాధనలు, హోమాలు, మద్యాహ్నం శ్రీశ్రీశ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహ సంస్థాన పీఠాదీశ్వరులు శ్రీ మదభినవోద్దండ విద్యా శంకర భారతి స్వాముల తో యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలియజేశారు. టీఆర్ఎస్ పార్టీ నేతలు అమర్, మారేపల్లి బాబురావు, దేవేందర్, శ్రీను తదితరులు ఉన్నారు.