కామారెడ్డి టౌన్, జనవరి 21 : ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద రూ.3.5 లక్షల సొత్తును రికవరీ చేసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. శుక్రవారం ఏర్పాటుచేసినన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని పోసాని శ్రీనివాస్ ఇంట్లో నవంబర్ 30న జరిగిన చోరీపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అప్పటికే దొంగతనాలు పెరుగుతుండడంతో ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్రెడ్డి ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఇందులో భాగంగా పద్మాజివాడి ఎక్స్రోడ్ వద్ద గురువారం అనుమానాస్పదంగా కనిపించిన ధ్యానేశ్వర్ చౌహాన్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా, మరో ఇద్దరితో కలిసి చోరీలకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించాడు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్స్టేషన్ పరిధిలోనూ దొంగతనాలు చేసినట్లు తెలిపాడు. నిందితుడి శుక్రవారం అరెస్టు చేసి కోర్టుకు తరలించామని ఎస్పీ తెలిపారు. అతడి నుంచి రూ.3లక్షల 50వేల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు విశాల్ప్రకాశ్ చౌహాన్, జయరామ్ రాథోడ్ పరారీలో ఉన్నారని వివరించారు. సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించామని, త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్ రెడ్డి, సదాశివనగర్ సీఐ రామన్, ఎస్సై శేఖర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ జాన్రెడ్డి, సిబ్బంది ఉస్మాన్, సయ్యద్, గణపతి, గణేశ్ను ఎస్పీ అభినందిస్తూ రివార్డును అందజేశారు.