బోనకల్లు, జనవరి 21: రాష్ట్రంలో టీఆర్ఎస్ సభ్యుల కుటుంబాలకు పార్టీ భరోసాగా నిలిచే కార్యక్రమాన్ని పార్టీ అధినేత కేసీఆర్ ఏర్పాటు చేశారని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. మండలంలోని తూటికుంట్ల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేత గడ్డం వెంకటేశ్వరరావు కుమారుడు ప్రశాంత్ నిరుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ప్రశాంత్ టీఆర్ఎస్ సభ్యత్వం కలిగి ఉండడంతో పార్టీ సమూహ ప్రమాద బీమా నుంచి మంజూరైన రూ.2 లక్షల చెక్కును శుక్రవారం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు.. ప్రశాంత్ తల్లిదండ్రులకు శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా కమల్రాజు మాట్లాడుతూ టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న ప్రతి సభ్యుడి కుటుంబానికి ‘నేనున్నా’నంటూ సీఎం కేసీఆర్ భరోసాగా నిలిచి వారి కుటుంబాలకు ఆర్థికసాయం అందించేందుకు శ్రీకారం చుట్టారన్నారు. దీనివల్ల ఆ కుటుంబాలకు ఎంతో కొంత పార్టీ ద్వారా ఆర్థికసాయం అందుతుందన్నారు. అంతేగాక ఇలాంటి పథకాలు కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే అమలు కావడం ప్రజల అదృష్టమన్నారు. వీటితోపాటు రైతుబీమా పథకం రైతుల కుటుంబాలకు ఎంతో మేలు కల్పిస్తుందన్నారు. ప్రతి పథకాన్నీ రాష్ట్రంలో ప్రజల ముంగిటకు తీసుకెళ్లిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని అన్నారు. టీఆర్ఎస్ బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ నాయకులు చేబ్రోలు మల్లికార్జునరావు, బంధం శ్రీనివాసరావు, వేమూరి ప్రసాద్, మోదుగుల నాగేశ్వరరావు, బాణోతు కొండా, సాదినేని శ్రీనివాసరావు, యనిగండ్ల మురళి, తమ్మారపు బ్రహ్మయ్య, పాపినేని కృష్ణ, దుంపల సురేందర్, కంచర్ల అచ్చయ్య, తుల్లూరి రవి తదితరులు పాల్గొన్నారు.