దేవాదుల ఎత్తిపోతల పథకం కింద ఉన్న తపాస్పల్లి రిజర్వాయర్ను కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోకి మారుస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి తపాస్పల్లికి జలాలు తరలించాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. ఇందుకోసం గ్రావిటీ లింక్ కాల్వల నిర్మాణానికి రూ.388.20 కోట్లు మంజూరు చేసింది. లింకు కాల్వలను నిర్మించి, మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలు తీసుకొచ్చి, తపాస్పల్లి రిజర్వాయర్ నింపనున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దేవాదుల (చొక్కారావు ఎత్తిపోతల పథకం ) ఫేస్-2, 3 ద్వారా తపాస్పల్లి రిజర్వాయర్ను నింపుతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 1,29,630 ఎకరాలకు సాగు నీరు అందనున్నది. వీటితో పాటు మెదక్ జిల్లా ఘనపూర్ ఆనకట్ట ఆధునీకరణకు రూ.50.32 కోట్లు మంజూరు చేసింది. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం నిధుల సేకరణ కోసం మంజీరా లిప్టు ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. సర్కారు ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జలాలు రానుండడంతో ఈ ప్రాంతం సస్యశ్యామలం కానున్నది.
గజ్వేల్ రూరల్, జనవరి 17 : ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో గజ్వేల్కు రైలు మార్గం సుగమమైంది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న చిరకాల కోరిక త్వరలోనే నెరవేరనున్నది. తెలంగాణ ఆవిర్భావం తరువాత ప్రధానంగా గజ్వేల్, సిద్దిపేట, కరీంనగర్ పట్టణాలకు రైలుమార్గం తెచ్చేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనోహరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వరకు చేపడుతున్న రైలుమార్గం ఇప్పటికే గజ్వేల్ వరకు పూర్తయింది. గజ్వేల్ నుంచి దుద్దెడ వరకు రెండో దశ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. మొదట్లో గజ్వేల్ వరకు ప్యాసింజర్ రైలును నడిపేందుకు రైల్వే అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. హైదరాబాద్లోని నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద రద్దీ అధికంగా ఉంటున్న దృష్ట్యా నగరానికి సమీపంలోని ఏదైనా ప్రాంతం నుంచి దేశంలోని ముఖ్యపట్టణాలు, నగరాలకు రైళ్లను నడిపేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారు. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151 కిలోమీటర్ల మార్గాన్ని రూ.1160.47కోట్లతో చేపడుతున్నారు. ఇప్పటికే గజ్వేల్ వరకు 31 కిలోమీటర్ల ట్రాక్, బ్రిడ్జిలు, రైల్వేస్టేషన్ల నిర్మాణం పూర్తయింది.
నాంపల్లి నుంచి గజ్వేల్ 60 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో తిరుపతి, ఢిల్లీ, షిరిడీ, ముంబయి తదితర పట్టణాలకు గజ్వేల్ నుంచే రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. నాంపల్లి స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ సమస్య ఉండడంతో అక్కడికి వెళ్లే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని అన్నింటి నుంచి ఉపశమనం లభించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. నాంపల్లి స్టేషన్ విస్తరణ చేయడం అసాథ్యమైన నేపథ్యంలో దానికి ప్రత్యామ్నాయంగా దగ్గర్లోనే ఉన్న గజ్వేల్ను రైల్వే అధికారులు ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఇక్కడి నుంచి రైళ్లను ప్రారంభిస్తే గజ్వేల్ రైల్వేస్టేషన్ను మరింత విస్తరించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. భారీగా ట్రాక్లను నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంటుం ది. ఇదే జరిగితే గజ్వేల్ తెలంగాణలోనే ప్రధాన రైల్వే పట్టణంగా మారనుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు సేకరించారు. కాగా, సోమవారం కూడా రైల్వే అధికారులు ఇంజిన్తో పాటు నాలుగు బోగీలతో ఉన్న రైల్ను మనోహరాబాద్-గజ్వేల్ మార్గంలో ట్రయల్న్ నిర్వహించి పనితీరును పరిశీలించారు.
స్వరాష్ట్రంలోనే రైలు కూత…
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్న తరువాత ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చేందుకు ఎంతో కృషి చేశారు. ప్రభుత్వాలు ఎన్ని మారి నా ఇక్కడ రైలు కూత మాత్రం వినిపించలేదు. దీంతో, సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151 కిలోమీటర్ల రైలు మార్గానికి భూసేకరణ చేపట్టి దక్షిణ మధ్య రైల్వే అధికారులకు అప్పగించడంతో పనులు చకచక జరుగుతున్నాయి. ఇప్పటికే మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు 31కిలోమీటర్ల మేర పనులు పూర్తవగా, రెండో రీచ్ పనులు గజ్వేల్ నుంచి దుద్దెడ వరకు జోరుగా కొనసాగుతున్నాయి. ఇక మూడో రీచ్ పనులు దుద్దెడ నుంచి సిరిసిల్ల వరకు, నాలుగో రీచ్ సిరిసిల్ల నుంచి కొత్తపల్లి వరకు త్వరలోనే పనులను ప్రారంభించనున్నారు.
పరిశ్రమల స్థాపనకు అవకాశం…
గజ్వేల్ పట్టణానికి త్వరలోనే రైళ్లు వచ్చేందుకు మార్గం సుగమం కావడంతో ఈ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించేందుకు వ్యాపారులు సుముఖంగా ఉన్నారు. గజ్వేల్ నుంచి ప్రధాన పట్టణాలకు రైళ్ల రాకపోకలు జరిగితే భారీ ఎత్తున పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. కాగా, రింగ్రోడ్డు పనులు గజ్వేల్ పట్టణం చుట్టూ జరుగుతుండగా చివరి దశలో ఉన్నాయి. రింగ్రోడ్డు వెలుపలనే రైల్వేస్టేషన్ ఉండడం కూడా ప్రయాణికులు, వ్యాపారులకు ఎంతగానో కలిసొస్తుంది.