యాదగిరిగుట్ట రూరల్, ఏప్రిల్ 1 : హైవేలపై నిత్యం రద్దీ వరంగల్-హైదరాబాద్, విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారులపై అనునిత్యం వాహనాల రద్దీ ఉంటుంది. ఈ హైవేలపై ప్రతి రోజూ వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. హైవే విశాలంగా ఉండడంతో వాహనదారులు పరిమితికి మించిన వేగంతో వెళ్తుంటారు. భువనగిరి, ఆలేరు పట్టణాలకు బైపాస్లు ఉండడం, చౌటుప్పల్ పట్టణ ప్రాంతంలో రోడ్లు విశాలంగా ఉండడంతో కొంత మంది మితిమీరిన వేగంతో ప్రయణిస్తుంటారు. దాంతో ఎక్కడో ఒక చోట ప్రమాదాలు నిత్య కృత్యంగా మారాయి. ప్రమాదాలకు కారణం అతివేగంతో పాటు వాహనదారుల నిర్లక్ష్యం, మద్యం తాగి వాహనాలు నడుపడం అని పోలీసులు చెబుతున్నారు.
రోడ్డు ప్రమాదాలకు కళ్లెం వేయడానికి ట్రాఫిక్ పోలీసులు పలు రకాల చర్యలు తీసుకుంటున్నా కొంత మంది మాత్రం పట్టించుకోవడం లేదు. మద్యం తాగి వాహనాలు నడపకూడదనే.. ట్రాఫిక్ పోలీసులు రాయిగిరి, వంగపల్లి, ఆలేరు, భువనగిరి, బీబీనగర్ టోల్గేట్, చౌటుప్పల్ టౌన్, పంతంగి టోల్గేట్ల వద్ద నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పట్టుబడిన కొంత మందిలో మార్పు వచ్చినా మరి కొంత మందిలో మాత్రం మార్పు రావడం లేదు. వేగానికి కళ్లెం వేసేందుకు జాతీయ రహదారిపై పలు చోట్ల వాహనాల వేగాన్ని తెలియజేసే ఎల్ఈడీ బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. దాంతో వేగాన్ని నియంత్రిచేందుకు లెజర్ స్పీడ్గన్స్ ఉపయోగిస్తున్నారు. నిత్యం పోలీస్ ఉద్యోగి హైవేపై వాహనాల వేగాన్ని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు సూచించిన వేగం కంటే అధికంగా వెళితే ఆ వాహనాన్ని ఫొటో తీస్తున్నారు. వాటి ఆధారంగా వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, లారీలు, ఆటోలు ఇలా ఏ వాహనమైనా నిర్ణీత వేగం దాటితే వెంటనే స్పీడ్గన్లు పసిగడుతాయి.
వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై భువనగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో జనవరి, ఫిబ్రవరి, మార్చిలో 13,020 కేసులు నమోదయ్యాయి. ఇందులో భువనగిరి ట్రాఫిక్ పీఎస్ పరిధిలో 8,308 కేసులు నమోదవగా రూ. 85,96,980 జరిమానా విధించారు. చౌటుప్పల్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో 4,712 కేసులు నమోదవగా రూ.47,12,000 జరిమానా విధించారు. గరిష్ఠ వేగం కంటే ఎక్కువ స్పీడ్తో వెళ్లే వాహనానికి రూ.1,035 ఫైన్ వేస్తున్నారు.
వాహనాల వేగాన్ని నియంత్రించడం ద్వారా రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టాలని పోలీసులు భావిస్తున్నారు. దాంతో పాటు వాహనదారుల్లో చైతన్యం పెరగాలని, వాహనం వేగం పెంచే క్రమంలో ఒక్క సారి కుటుంబం గురించి ఆలోచించాలని అవగాహన కల్పిస్తున్నారు. వాహనదారులు నిబంధనలను పాటిస్తూ ప్రయాణిస్తే ప్రమాదాలను నివారించే అవకాశం ఉంది.
వాహనాన్ని అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగి కుటుంబం నష్టపోతున్నది. కాబట్టి వాహనదారులు రోడ్డు నిబంధనలను పాటిస్తే చాలా వరకు ప్రమాదాలకు చెక్ పడినట్లే. వాహనదారులు, ప్రయాణికులు క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవడమే మా లక్ష్యం. ఇందులో భాగంగా అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు సహకరించాలి.
-శంకర్, ట్రాఫిక్ ఏసీపీ, యాదాద్రి భువనగిరి జోన్