మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జనవరి 21 : కరోనా వచ్చిందని భయపడొద్దని, ఒక్క ఫోన్ కాల్ చేస్తే వైద్య సిబ్బంది ఇంటికొచ్చే చికిత్స అందిస్తారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. చికిత్స అవసరమైన వారు 08542-241165కు ఫోన్ చేయాలని సూచించారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండలో ఇంటింటికీ వెళ్లి మంత్రి ప్రజలతో మాట్లాడి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా.. అని ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కొవిడ్ను ఎదుర్కొనేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా ఫీవర్ సర్వే చేపట్టిందన్నారు. జ్వరం, జలుబు, దగ్గు, ఇతర లక్షణాలున్నా వైద్య సిబ్బంది మందులు అందజేస్తారని తెలిపారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు హోం ఐసొలేషన్లో ఉండాలని జాగ్రత్తలు సూచించడంతోపాటు మందుల కిట్ను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలని సూచించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఆక్సిజన్ పడకలతో సహా అవసరమైన మందులు, సౌకర్యాలను అందుబాటులో ఉంచినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైద్య సేవలు మెరుగయ్యాయని, ఎవరూ ఆందోళన చెందొద్దని ధైర్యం చెప్పారు. పాజిటివ్ వచ్చిన వారు ట్యాబ్లెట్లు వేసుకోవాలని, భయపడకుండా జాగ్రత్తలు తీసుకుంటే నయమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.
మహబూబ్నగర్ జిల్లాలో ఇంటింటా ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా 1,89,319 ఇండ్లకు వెళ్లిన వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు వివరాలు సేకరించారని తెలిపారు. జిల్లాలో 40 వేల ఐసొలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అవసరమైతే లక్ష కిట్లు ఇస్తామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎవరికైనా అనుమానం వస్తే ఇంటి దగ్గరే కొవిడ్ కిట్లలోని మందులు వేసుకోవడంతోపాటు చికిత్స తీసుకోవాలని సూచించారు. కొవిడ్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో చర్యలు చేపట్టినట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ వివరించారు. ఇందులో ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యత తీసుకొని బాగా పనిచేయాలని ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ జిల్లాలో ఇంటింటా ఆరోగ్య సర్వే నిమిత్తం మల్టీ డిసిప్లినరీ బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇందు లో వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందితోపాటు, రెవెన్యూ, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఉన్నారన్నారు. అందరూ ఐదు రోజుల్లో జిల్లాలోని 1.89 లక్షల ఇండ్లల్లో వివరాలు సేకరించేలా లక్ష్యం నిర్దేశించినట్లు తెలిపారు. ప్రతి మండలానికి ప్రత్యేక అధికారిని నియమించామని, శుక్రవారం నుంచి ఉదయం 7 గంటలకే గ్రామాలకు వెళ్లి సర్వేను ప్రారంభించారని స్పష్టం చేశారు. కరోనా కట్టడిలో గతం కన్నా మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్గౌడ్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు కొరమోని వెంకటయ్య, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, డీఎంహెచ్వో కృష్ణ, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.