సైదాబాద్ : నియోజక వర్గ పరిధిలో మురుగునీటి వ్యవస్థల అధునీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ బలాల అన్నారు. జలమండలి ఆధ్వర్యంలో గురువారం అక్బర్బాగ్ డివిజన్ పరిధిలోని దిల్కుష్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మురుగు నీటి నిర్వహణపై భద్రత అవగాహన పక్షోత్సవాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురుగునీటి వ్యవస్థ నిర్వహణలో బాధ్యతలు నిర్వహిస్తున్న సివరేజ్ కార్మికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు.
సివరేజ్ కార్మికులు జలమండలి ఇచ్చిన భద్రత పరికరాలను తప్పనిసరిగా ఉపయోగించాలని, పరికరాలను ధరించకుండా పనులు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహిందరాదన్నారు. సివరేజ్ కార్మికుల పని భారం తగ్గించటానికి, యంత్రాలను, పరికరాలను ఉపయోగించాలన్నారు. కార్మికులు మంచిగా ఉంటే నగరం పరిశుభ్రంగా ఉంటుందని అందుకోసం జలమండలి అధికారులు ఖాళీ పోస్ట్లను తక్షణమే భర్తీ చేయాలని ఆయన కోరారు. ప్రజలకు మురుగునీటి ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, అందుకోసం నిరంతరం శ్రమించాలన్నారు.
జలమండలి సీజీఎం వినోద్ భార్గవ్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించటానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బలాల, సీజీఎం వినోద్ భార్గవ్ సివరేజ్ కార్మికులకు భద్రత పరికరాలను అందజేసి, వారిని పూలదండలు, శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఏజీఎం నాగేంద్ర కుమార్, ఆస్మాన్ఘడ్ సబ్ డివిజన్ డీజీఎం షీలారాణీ, వివిధ సేక్షన్ల మేనేజర్లు అల్తాప్ ఫయాజ్, శ్రవణ్, హస్మత్ అలీ, వర్క్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.