మన్సూరాబాద్ : ఉరుకుల పరుగుల జీవితాలతో నిత్యం బిజీగా ఉండే ప్రజలు తమ ఆరోగ్యాలను పరిరక్షించుకునేందుకు ప్రతి రోజు గంట పాటు వ్యాయామం, యోగా చేయాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ పరిధి జీఎస్ఐ సమీపంలోని మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కులో ఏర్పాటు చేసిన యోగా కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు.
అనంతరం వాకర్స్తో కలిసి మార్నింగ్ వాక్ చేసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కులో వాకింగ్ చేసే ప్రజలు గతంలో ఓపెన్ జిమ్, యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తనను కోరడం జరిగిందని తెలిపారు.
వాకర్స్ కోరిక మేరకు అటవీశాఖ అధికారులతో మాట్లాడి యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని త్వరలో ఓపెన్ జిమ్ను నెలకొల్పుతామని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్న మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కులో వాకింగ్ కోసం వచ్చే ప్రజలకు మరింత మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు.
స్వచ్ఛమైన గాలిని అందించే మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కులో వాకింగ్ చేసే వారికి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, నాయకులు అనంతుల రాజిరెడ్డి, పోచబోయిన జగదీష్యాదవ్, చెరుకు ప్రశాంత్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.