రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. పెట్టుబడి సాయం అందించి వడ్డీ వ్యాపారుల నుంచి విముక్తి కల్పించింది. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చర్యలు చేపట్టింది. కర్షకుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కేలా మద్దతు ధర కల్పిస్తున్నది. పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడకూడదని వారికి అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. దీంతో వానకాలం రైతులు పండించిన ధాన్యం సేకరణ జోరందుకున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశకు చేరుకున్నది. తాజాగా క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ధాన్యం సేకరణను వేగవంతం చేశారు. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో 2.62 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.230 కోట్లు జమ చేశారు. మరో రూ.51 కోట్లు జమ చేయాల్సి ఉన్నది. భద్రాద్రి జిల్లాలో 92,932 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా.. రైతుల ఖాతాల్లో రూ.190 కోట్లు జమ చేశారు.
ఖమ్మం, జనవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భద్రాద్రి కొత్తగూడెం (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ధాన్యం సేకరణ చివరి దశకు చేరుకున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వానకాలం రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తున్నది. వానకాలంలో పండించిన పం టను కొనుగోలు చేయడం కష్టతరమనే అభిప్రాయం వ్యక్తమైనప్పటికీ తెలంగాణ సర్కార్ ముందుకు వచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. తాజాగా క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ధాన్యం సేకరణను వేగవంతం చేశారు. మరోవైపు వ్యవసాయశాఖ అధికారులు యాసంగికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో ధాన్యం సేకరణ ఇలా..
గతేడాది వానకాలంలో 2.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిన అధికారులు ఈ వానకాలంలో ఇప్పటికే 2.62 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.230 కోట్లు జమ చేశారు. మరో రూ.51 కోట్లు జమ కావాల్సి ఉన్నది. ధాన్యం సేకరణకు గత నవంబర్లో జిల్లాలో 236 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అత్యధికంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘాల పరిధిలో 110 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇవే కాక ఐకేపీ, డీసీఎంఎస్, వ్యవసాయ మార్కెట్ల పరిధిలో కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఈ నెలాఖరు లోపు మరో 8 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యాన్ని ఛేదించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. మొత్తం 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్, అదనపు కలెక్టర్ మధుసూదన్ ఎప్పటికప్పుడు కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. రైతుల బ్యాంకు ఖా తాల్లో సొమ్ములు జమ చేయిస్తున్నారు.
నాగార్జున సాగర్ ఆయకట్టులో ఎక్కువ..
వానకాలంలో నాగార్జున సాగర్ ఆయకట్టులో 2.99 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రధానంగా సత్తుపల్లి, కల్లూరు, నేలకొండపల్లి, ముదిగొండ ఎన్నెస్పీ పరిధిలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలోని పంటలు ముందుగా కోతకు వచ్చాయి. మంత్రి అజయ్కుమార్ ఆదేశాల మేరకు అధికారులు ధాన్యం సేకరణ పూర్తి చేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని సిద్దారం సొసైటీ పరిధిలో గతేడాది నవంబర్లో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, అదనపు కలెక్టర్ మధుసూదన్ ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు.
భద్రాద్రి జిల్లాలో సేకరణ ఇలా..
భద్రాద్రి జిల్లాలో 156 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చేపట్టగా ఇప్పటికే 65 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు పూర్తయ్యాయి. మిగిలిన 91 కేంద్రాల ద్వారా ధాన్య సేకరణ జరుగుతున్నది. కేంద్రాల్లో ధాన్యం ఆరబోతకు ఏర్పాట్లు ఉన్నాయి. తేమశాతం చూసే పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు అవసరమైన గన్నీ బ్యాగ్లు సమకూరుస్తున్నారు. ఇప్పటివరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.190 కోట్ల సొమ్ములను జమ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి చేరువలో భద్రాద్రి జిల్లా ఉన్నది. అధికారులు వానకాలంలో 1.20 లక్షల మెట్రిక్ ట న్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా ఇప్పటివరకు 92,932 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. మరో వారం రోజుల్లో నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించనున్నారు. ఇప్పటికే కొత్తగూడెం, ఇల్లెందు, జూలూరుపాడు మండలాల పరిధిలో కొనుగోళ్లు పూర్తయ్యాయి. మణుగూరు, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షం కారణంగా కొ నుగోళ్లు ఆలస్యమయ్యాయి. ఆయాప్రాంతాల్లో కోతలు చివరి దశకు చేరుకున్నాయి.
నిరంతరం పర్యవేక్షణ..
ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. కొన్నిచోట్ల వరి కోతలు ఆలస్యమైనప్పటికీ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేకరణ పూర్తి చేశాం. గత వానకాలం కంటే ఈ సారి ఎక్కుగా ధాన్యం సేకరించాం. ఎప్పటికప్పుడు రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఒకటి రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తాం.
వారం రోజుల్లో సేకరణ పూర్తి..
వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుంది. భద్రాద్రి జిల్లాలో ఇప్పటికే 65 కేంద్రాల పరిధిలో ధాన్యం సేకరణ పూర్తయింది. రైతులందరి ఖాతాల్లో సొమ్ములు జమ చేశాం. కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా పంట చేతికి వచ్చింది. ఆయా పంటలు కోతకు వచ్చాయి. రైతులు పండించిన చివరి గింజా కొనుగోలు చేస్తాం.