మూడ్రోజుల ముచ్చటైన సంక్రాంతి పండుగలో తొలి రోజు భోగి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. ఓ వైపు దేవాలయాల్లో ధనుర్మాస ఉత్సవ పూజలు, మరో వైపు భోగి వేడుకలు అంబరాన్నంటేలా
సాగాయి. ఇండ్ల ముందు వేసిన రంగురంగుల ముగ్గులు ఆకట్టుకున్నాయి. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలతో పల్లెల్లో సందడి నెలకొంది. చిన్నారులకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. ఇదిలా ఉండగా ధనుర్మాస
ఉత్సవాల్లో చివరి ఘట్టంగా శుక్రవారం పలు ఆలయాల్లో గోదారంగనాయక స్వామి కల్యాణోత్సవాలు నిర్వహించారు. సంక్రాంతి పండుగను శనివారం జరుపుకోనున్నారు. శని త్రయోదశి కావడంతో ఆలయాల్లో పూజలు చేయనున్నారు. ఆదివారం కనుమ పండుగను కమనీయంగా చేసుకుంటారు.
వేడుకలు కాదు.. ప్రాణాలు ముఖ్యం
రామగిరి, జనవరి 14 : వేడుకల కంటే ప్రాణాలు విలువైనవి. ప్రాణాల తరువాతే పండుగ సంబురాలు.. అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పండుగను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని సూచించారు. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం ద్వారానే కరోనాకు పుల్స్టాఫ్ పెట్టగలమని పేర్కొన్నారు. నిబంధనల మేరకు వేడుకలు జరుపుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.