శుభకృత్ నామ సంవత్సరంలో అంతా శుభమే జరుగుతుందని పంచాంగ శ్రవణంలో పండితులు ప్రవచించారు. ఏడాదంతా మంచి పరిణామాలే ఉంటాయని పేర్కొన్నారు. నూతన తెలుగు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉగాది పర్వదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి, పంచాంగ శ్రవణాలు నిర్వహించగా, ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
కమాన్చౌరస్తా, ఏప్రిల్ 2 : ఉగాది పర్వదిన వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే దేవాలయాల్లో అర్చనలు, అభిషేకాలు, సహస్రనామార్చన, హోమాల వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉంటారని, అన్నీ శుభాలే జరుగుతాయని వేద పండితులు పంచాంగం పఠించి, రాశుల ఫలితాలు వివరించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. వారితో పాటు జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ వై సునీల్రావు, జడ్పీ సీఈవో ప్రియాంక, జిల్లా వైదిక పండితులు పురాణం మహేశ్వర శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాంగ పఠనం నిర్వహించారు. అనంతరం పండితులను సన్మానించారు.
వేములవాడ రాజన్న ఆలయ ఆవరణలో ఓపెన్ స్లాబ్పై సాయంత్రం పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉదయం ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్బాబు రాజన్నను దర్శించుకుని, కోడెమొక్కు చెల్లించుకున్నారు.
పెద్దపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో స్థానిక అమర్చంద్ కల్యాణ మండపంలో నిర్వహించిన పంచాంగ శ్రవణంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పాల్గొన్నారు. ఉదయం పెద్దపల్లిలోని శాంతినగర్ కోదండరామాలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. గోదావరిఖనిలోని తన క్యాంపు కార్యాలయంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి ఈశ్వర్తో కలిసి దర్శించుకొని పూజలు నిర్వహించారు. జగిత్యాల పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన పంచాంగ శ్రవణానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ హాజరయ్యారు. మెట్పల్లి విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని పాత బస్టాండ్ చౌరస్తా వద్ద ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ప్రారంభించారు. కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధానంలో నిర్వహించిన వేడుకలకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరయ్యారు.
శుభకృత్ నామ సంవత్సరంలో అందరికీ సకల శుభాలు కలగాలి. జిల్లా వాసులు సుఖసంతోషాలతో ఉండాలి. కరీంనగర్ జిల్లా పుణ్యక్షేత్రాలు, కవులు, కళాకారులకు నిలయం. జిల్లా ప్రజలపై సీఎం కేసీఆర్కు ఎనలేని ప్రేమ ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి పదెకరాలు, మెడికల్ కాలేజీ మంజూరు చేశారు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణాన్ని దేశ చరిత్రలోనే అద్భుతంగా చేపట్టాం. మానేరు రివర్ ఫ్రంట్కు శంకుస్థాపన చేసుకున్నాం. త్వరలోనే పూర్తి చేసుకోబోతున్నాం. అద్భుతమైన రహదారులు ఏర్పాటు చేసుకున్నాం. ఆయన అద్భుతమైన పాలనతో రాష్ట్రం అగ్రగామిగా దూసుకెళ్తున్నది. మండు వేసవిలోనూ నదులు గలగలా పారుతున్నాయి. చెరువులు నిండుకుండల్లా కళకళలాడుతున్నాయి. పాడి పంటలతో ప్రజలు సంతోషంగా ఉంటున్నారు.