పెద్దశంకరంపేట, జనవరి 13 : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ, వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుకు వేంకటేశ్వరస్వామి దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం గురువారం పేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళి పంతులు కలిసి వేంకటేశ్వరస్వామి మెమోంటోను బహూకరించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు రామచంద్రాచారి, మాజీ ఎంపీపీ రాజు, నాయకులు చందర్, సంతోశ్, దేవేందర్, ఉప్పరి వెంకటేశం, వంశీ తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మదన్రెడ్డి..
నర్సాపూర్, జనవరి 13 : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి గురువారం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని దేవుడిని వేడుకున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకుడు గొర్రె వెంకట్ ఉన్నారు.
శివ్వంపేటలో..
శివ్వంపేట, జనవరి 13 : ముక్కోటి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని గురువారం శివ్వంపేట మండల నాయకులతో కలిసి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వెంకటేశ్వరస్వామి అనుగ్రహంతో శివ్వంపేట మండలం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలని, పాడి పంటలతో రైతుల కష్టాలు తీర్చాలని స్వామివారికి మొక్కుకున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, ఎలక్షన్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు లావణ్యమాధవరెడ్డి, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు రాఘవేందర్రావు, బీసీ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సంతోష్ తదితరులు ఉన్నారు.
నర్సాపూర్లో..
నర్సాపూర్, జనవరి 13 : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్ సంగారెడ్డిలోని వైకుంఠపురాన్ని సందర్శించి వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని వేడుకున్నట్టు తెలిపారు.
పెద్దశంకరంపేటలో..
పెద్దశంకరంపేట, జనవరి 13 : ముక్కోటి ఏకాదశి సందర్భంగా పెద్దశంకరంపేట పట్టణంలోని ఆయా ఆలయాల్లో భక్తులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్థానిక వేంకటేశ్వర ఆలయం, వేణు గోపాలస్వామి ఆలయం, విఠలేశ్వర ఆలయం, రామాలయాలను రకరకాల పూలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధాన వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ వాకిళ్ల ద్వార ప్రవేశించి స్వామివారిని దర్శనం చేసుకుంటే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం. అందుకోసం భక్తులు పలు ఆలయాల్లో అభిషేకాలు, పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. స్థానిక రామాలయంలో భక్తులను వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం నిర్వహించారు.
చేగుంటలో..
చేగుంట, జనవరి 13 : కళ్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు కనుల పండుగగా జరిగాయి. ఆలయ ధర్యకర్త సుదర్శన్, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేగుంటలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.