మనోహరాబాద్, జనవరి 16 : తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో గల రామప్పగుట్టలో భవానీ సమేత రామలింగేశ్వరస్వామి వారి జాతర శనివారం ఘనంగా ప్రారంభమైంది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే జాతర శనివారం ప్రారంభమైంది. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు గుట్టకు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం పుణ్యహవచనం, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, నవగ్రహ పూజలు, దేవతామూర్తుల అభిషేకాలను నిర్వహించారు. గ్రామస్తులు బండ్ల ఊరేగింపు నిర్వహించగా, కోరికలు నెరవేరిన భక్తులు బెల్లం ప్రసాదాన్ని పంచిపెట్టారు. ఆదివారం స్వామి వారి ఉత్సవ మూర్తులను ఊరేగించగా, సాయంత్రం గ్రామంలో గోపాలకాల్వ నిర్వహించారు. జాతరకు వచ్చిన భక్తులు ప్రకృతితో సెల్ఫీ ఫొటోలను తీసుకున్నారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకున్నట్లు ఆలయ పురోహితుడు శలాక ఆత్రేయశర్మ, ఆలయ కమిటీ చైర్మన్ సురేందర్రెడ్డి, సర్పంచ్ సుకన్యరమేశ్ తెలిపారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తూప్రాన్ పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.