మెహిదీపట్నం: గణేష్ నవరాత్రి ఉత్సవాలను కోవిడ్ నియమనిబంధనల మేరకు విజయవంతంగా నిర్వహించుకోవాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవసమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు అన్నారు. గురువారం సాయంత్రం మెహిదీపట్నం జి.పుల్లారెడ్డి కళాశాలలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నూతనంగా నియమించిన కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భగవంతరావు మాట్లాడుతూ కన్వీనర్లు ఆయా ప్రాంతాల మండపాల నిర్వాహకులు,బస్తీ సంక్షేమ సంఘాలు,ఆలయాల ప్రతినిధులు,రాజకీయలకు అతీతంగా అందరితో సమావేశాలు ఏర్పాటు చేసి గణేష్ నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు.
హిందూ ధర్మంపై అనేక అసాంఘీక శక్తులు మూకుమ్మడి దాడి చేస్తున్నాయని,ఈ నేపధ్యంలో నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలని భగవంతరావు అన్నారు.అనుమతుల పేరుతో పోలీసులు వేధింపులకు గురిచేస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు రాఘవ రెడ్డి మాట్లాడుతూ మండపాల వద్ద ప్రశాంత వాతావరణంలో పూజలు జరపాలన్నారు.ప్రతి చోటా కోవిడ్ నియమనిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించేలా నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని అన్నారు. ధార్మిక,సాంస్కృతిక కార్యక్రమాలను మండపాల వద్ద నిర్వహిస్తూ ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందిచడానికి కృషి చేయాలని రాఘవ రెడ్డి అన్నారు.ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికయిన కన్వీనర్లు పాల్గొన్నారు.