చూడచక్కని రూపం, ఎర్రటి పొడవాటి ముక్కు, సన్నని పొడవాటి కాళ్లు, తెల్లని ఈకలతో చూడగానే అబ్బురపర్చే ఆకర్షణీయ రూపం. వందలు కాదు వేలు, లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి సందడి చేస్తున్నాయి విదేశీ వలస పక్షులు. మెదక్ జిల్లాలోని పోచారం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి సైబీరియా, నైజీరియా, అప్ఘనిస్తాన్, బర్మా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక తదితర దేశాల నుంచి వలస పక్షులు విడిదికి వచ్చాయి. ఈ విశిష్ట అతిథుల రాకతో ఈ ప్రాంతం కొత్తకళను సంతరించుకున్నది. ఎటుచూసినా పచ్చని చెట్లు.. ఆహ్లాదకర వాతావరణం.. వన్యప్రాణులు, జంతువుల సంచారం.. దట్టమైన అడవి.. వెరసి విదేశీ పక్షుల రాకతో పోచారం ప్రాజెక్టు, పోచారం అభయారణ్యం పరిసరాలు ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇక్కడ పక్షులు సేదతీరి తిరిగి వెళ్తాయి. వీటిని తమ కెమెరాల్లో బంధించేందుకు నేచర్ ఫొటోగ్రాఫర్లు ఆసక్తి చూపుతున్నారు.
మెదక్-కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లోని పోచారం అభయారణ్యం ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. దేశవిదేశీ పక్షులు, వన్యప్రాణులు, ప్రకృతి సోయగాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ప్రస్తుతం దేశవిదేశీ పక్షులు ఇక్కడ సందడి చేస్తున్నాయి. వేల, లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన పక్షులను తిలకించడానికి పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు ఇక్కడి తరలివస్తున్నారు. విదేశీ అతిథుల రాకతో ఈ ప్రాంతం కళకళలాడుతున్నది.
మెదక్, జనవరి 22: పోచారం ప్రాజెక్టు, పోచారం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం మెదక్ జిల్లాలో ప్రధాన పర్యాటక ప్రాంతంగా పేరొందింది. ఎటుచూసినా పచ్చని చెట్లు, ఆహ్లాదకర వాతావరణం, వన్యప్రాణుల సంచారం, దట్టమైన అడవి, వివిధ జంతువుల సంచారంతో మెదక్ సమీపంలో ఉన్న పోచారం అభయారణ్యం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. అటవీ సంపదను సంరక్షిచడానికి తగిన చర్యలు చేపట్టి, అభయారణ్యం పరిధిలోకి జక్కన్నపేట, పోచారం, కామారెడ్డి, రాజిపేట్, మెదక్ రేంజ్లో విస్తరించి ఉన్న ఈ సాంక్చ్యురీని మన రాష్ట్రంతో పాటు వివిధ రాష్ర్టాల నుంచి పర్యాటకులు సందర్శిస్తున్నారు. ఎక్కడాలేని హరితదనం ఈ అభయారణ్యం సొంతం. మెదక్ పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచారం ప్రాజెక్టును వేసవిలో పర్యాటకులు పెద్దఎత్తున సందర్శిస్తారు. ఇక్కడికి వచ్చిన పర్యాటకులకు ప్రాజెక్టుతో పాటు చెట్లపై ఉండే చిలుకలు, కుందేళ్లు, దుప్పిలు, జింకలు, పక్షులు, వివిధ రకాల అడవి జంతువులు కనువిందు చేస్తాయి. నిజాం కాలంలో నవాబులు ఈ ప్రాంతంలో వేట సాగించేవారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం దీన్ని పోచారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా మార్చింది. 1950లో పోచారం వన్యప్రాణి అభయారణ్యంగా రూపాంతరం చెందింది. మెదక్-కామారెడ్డి జిల్లాల సరిహద్దులో సుమారు 33వేల ఎకరాల్లో అభయారణ్యం విస్తరించి ఉంది. మెదక్ జిల్లాలో 45 శాతం, కామారెడ్డి జిల్లాలో 55శాతం అడవి ఉంది. ఈ అరణ్యాన్ని ఆనుకొని చుట్టుపక్కల 35 గ్రామాలున్నాయి. అటవీ ప్రాంతంలో 2500 ఎకరాల స్థలంలో ప్రత్యేకంగా చెరువును ఏర్పాటు చేశారు. అక్కడకు చేరుకుంటున్న రకరకాల పక్షులు, కొంగలు, నెమళ్లు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అరుదైన పక్షులు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
విదేశీ అతిథులు వచ్చేశాయ్…
ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న విదేశీ అతిథులు రానేవచ్చాయి. ఎక్కడో లక్షల మైళ్ల దూరంలో ఉన్న విదేశీ పక్షులు శీతాకాలం మొదలైతే చాలు వందల సంఖ్యలో పోచారం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి చేరుకుంటాయి. సైబీరియా, నైజీరియా, అప్ఘనిస్తాన్, బర్మా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక తదితరాల దేశాల నుంచి పక్షులు పోచారం ప్రాజెక్టుకు, అభయారణ్యానికి వచ్చి విడిది చేస్తాయి. జిల్లాకు విచ్చేసిన ఆ విశిష్ట అతిథుల సందడితో ఆ ప్రాంతం కొత్త కళను సంతరించుకుంది.
చెట్లపైనే నివాసం..
పోచారం ప్రాజెక్టుకు వచ్చే విదేశీ పక్షులు చెట్లపైనే నివాసముంటాయి. పోచారం ప్రాజెక్టు పరిధిలో ఉండే చెట్లపైన వాలుతాయి. చెట్లతో పాటు చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా ఈ పక్షులకు అనుకూలంగా ఉంటుంది. విడిది చేసే ఈ పక్షులను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిపోయే జనాలు ఒకవైపు, పక్షుల కిలకిలరావాలు మరోవైపు, కనువిందు చేసే వాటి విన్యాసాలు ఒకవైపు, చెవులకు, కనులకు కొత్త అనుభూతులను మిగిల్చే రోజులు ఇప్పుడు పోచారం ప్రాజెక్టు పరిసరాల్లో కనిపిస్తున్నాయి. వందేండ్ల నుంచి పోచారం ప్రాజెక్టుకు విదేశీ పక్షులు వస్తున్నాయి. చూడచక్కని రూపం, ఎర్రటి పొడవాటి ముక్కు, సన్నని పొడవాటి కాళ్లు, తెల్లని ఈకలతో చూడగానే అబ్బురపరిచే ఆకర్షణీయ రూపం ఆ పక్షుల సొంతం. క్రమం తప్పక దేశ సరిహద్దులు దాటి వస్తున్న ఈ పక్షుల రాకతో పోచారం ప్రాజెక్టుకు కొత్త శోభను సంతరించుకుంటుంది.
21 రకాల పక్షులు..
21 రకాల పక్షులు పోచారం ప్రాజెక్టుకు విచ్చేస్తాయి. రష్యా దేశంలోని సైబీరియా నుంచి మహాసముద్రాలు దాటి మెదక్ జిల్లా పోచారం ప్రాజెక్టుకు కొంగల రాక ఇప్పటిది కాదని స్థానికులు అంటున్నారు. ప్రతీ ఏడాది డిసెంబర్, జనవరిలో విదేశీ పక్షులు వస్తుంటాయి. ఇందులో పసుపు పచ్చ పాదాల ఆకుపచ్చ పావురం, సాధారణ ఇసుక ఫైపర్, ఆకుపచ్చ ఇసుక ఫైపర్, సాధారణ ఆకుపచ్చ షాంక్, యురేషియన్ స్పారోహాక్, స్పాట్ బ్రెస్ట్ ఫ్యాైన్టెల్, బూట్ వార్బెర్ల్, పచ్చటి వార్లెర్, చెక్క ఇసుక ఫైపర్, బ్లైత్స్ రీడ్ వార్లెర్, క్లామరస్ రీడ్ వార్లెర్లాంటి విదేశీ పక్షులు వస్తుంటాయి. ఈ విదేశీ పక్షులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
పక్షుల కిలకిలరావాలు ఎంతో హాయినిస్తాయి..
పోచారం ప్రాజెక్టుకు ప్రతి ఏడాది డిసెంబర్, జనవరి మాసాల్లో విదేశీ పక్షులు వస్తాయి. ఈసారి కూడా విదేశీ పక్షులు వచ్చాయి. ఆహ్లాదకర వాతావరణంతో పాటు పక్షుల కిలకిలరావాలు ఎంతో హాయినిస్తాయి. విదేశీ వలస విహంగాల విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు, జంతు ప్రేమికులు వచ్చి వీటిని తిలకించి వారి కెమెరాల్లో బంధిస్తున్నారు.