సంగారెడ్డి, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఈ ఏడాది హరితహారంలో 1.06 కోట్ల మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా, ఉపాధి హామీ పథకంలో భాగంగా జిల్లాలోని అన్ని నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. అయితే, ఇప్పటికే నర్సరీల్లో 20 లక్షలకుపైగా మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 40 లక్షల వరకు మొక్కలను డీఆర్డీఏ ఆధ్వర్యంలో పెంచేందుకు చర్యలు ప్రారంభించగా, మిగితా 70 లక్షల మొక్కలను సిద్ధం చేసే ప్రక్రియ వేగంగా సాగుతుంది. కాగా, శాఖల వారీగా ప్రభుత్వం ఇప్పటికే లక్ష్యాలను నిర్దేశించింది. అత్యధికంగా డీఆర్డీఏ, అటవీశాఖలు మొక్కలు నాటనున్నాయి. ఉపాధి హామీ పథకంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని అన్ని పంచాయతీల్లో 647 గ్రామనర్సరీలను ఏర్పాటు చేశారు. కాగా, హరితహారంలో నాటేందుకు అవసరమైన 25 రకాల, 1,27,80, 000 మొక్కలను 639 నర్సరీల్లో పెంచుతున్నారు. ఇందుకోసం నర్సరీల్లో ఎర్రమట్టితో నింపిన కవర్లు సిద్ధం చేయడంతో పాటు కవర్లలో విత్తనాలను నాటుతున్నారు. ఈజీఎస్ అధికారులు, ఎంపీడీఓలు నర్సరీల్లో పనులను పర్యవేక్షిస్తున్నారు. మొక్కలు చూసుకునే బాధ్యతను వనసేవకుడికి అప్పగించారు. మొక్కల పెంపకం వేగంగా సాగుతున్నదని, హరితహారం ప్రారంభం నాటికి సిద్ధం అవుతాయని ఈజీఎస్ అధికారులు చెబుతున్నారు.
జూన్ నాటికి సిద్ధం : శ్రీనివాస్రావు, డీఆర్డీవో
జిల్లావ్యాప్తంగా ఎనిమిదో విడుత హరితహారంలో మొక్కలు నాటేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేశాం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా శాఖల వారీగా కేటాయింపులు పూర్తయ్యాయి. జిల్లాలోని 639 నర్సరీల్లో మొత్తం 1.27 లక్షల మొక్కలను పెం చుతాం. జూన్ నాటికి మొక్కలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం.