ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 14 : సంక్రాంతికి ఆడ పిల్లలు ముగ్గులు వేసి మురిసిపోతే మగపిల్లలు పతంగులను ఎగరేసి ఆనందిస్తారు. పల్లెల్లో ఈ సంస్కృతి అనాదిగా వస్తోంది. ఈశాన్య గాలులు ఎక్కువగా సంక్రాంతికి వీస్తుంటాయి. చలి తగ్గుముఖం పడుతూ ఎండ చురుక్కుమంటుంది. వేడి తీవ్రతకు మధ్యాహ్నం సమయంలో వాతావరణంలోని పీడనాల్లో హెచ్చుతగ్గులు ఏర్పడి గాలులు ఎక్కువగా వీస్తాయి. ఇవి పతంగులు ఎగురవేయడానికి అనుకూలిస్తాయి. అందుకే సంక్రాంతి రోజు ఆకాశంలోకి గాలిపటాలను ఎగిరేస్తారు. కొందరు పోటీలు పెట్టుకుంటారు. ఎక్కడ చూసినా రంగు రంగుల పతంగులతో చిన్నారులు కేరింతలు కొడుతూ కనిపిస్తారు.
ఆకర్ణణీయంగా..
పతంగులను ఎగురవేసేవారు ఒకప్పుడు సీసం ముక్కలను కలిపి వాటికి జిగటను చేర్చి వచ్చిన మిశ్రమాన్ని ధారానికి రాసి మాంజా తయారు చేసేవారు. కానిప్పుడు ఈ పద్ధతి కనిపించడం లేదు. చైనా మార్కెట్ మన పతంగుల్లోకి వచ్చేసింది. సన్నటి ప్లాస్టిక్తో తయారు చేసిన ధారం గరకుగా ఉంటుంది. దీనికి సాధారణ ధారం ఉన్న పతంగి తాకితే తేగిపోవడం ఖాయం. అందుకే చాలా మంది చైనా మాంజానే వాడుతున్నారు. మాంజా ధర రూ.30 పలుకుతుంది. ఆకర్షణీయమైన పతంగులు ఏయేటి కాయేడు ఊరిస్తున్నాయి. వీటి ధర రూ.5 నుంచి రూ.40 వరకు ఉంది. అభిమాన తారలు, క్రీడాకారులు, నాయకులు, జాతీయభావం తెలిపే విభిన్న రకాల పతంగులు మార్కెట్లో కనువిందు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి దిగుమతి అవుతున్నాయి.
జాగ్రత్తలు అవసరం..
గాలిపటం ఆకాశంలో ఎగురుతుంటే కింద భూమి కనిపించదు. ఈ సమయంలో ప్రమాదాలు జరుగుతాయి. మైదానంలో ఎగురవేయడం శ్రేయస్కరం. భవనాలపై ఎగురవేయడం సరికాదు. అలా ఎగురవేసినా పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి. రోడ్డుకు అడ్డంగా పరుగెత్తిరాదు. ఇది ప్రమాదకరం. రోడ్ల పక్కన గాలిపటాలతో ఆడరాదు. పోటీలు పెట్టుకుంటే అవి సరదాగా ఉండాలి తప్ప వాటితో బెట్టింగులు ఉండరాదు.