మారేడ్పల్లి : రైల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న 5 గురు నిందితులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి 38 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సికింద్రా బాద్ రైల్వే డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ చంద్రభాను, ఇన్స్పెక్టర్ ఎం. శ్రీనులు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఒరిస్సా రాష్ట్రానికి చెందిన పటి పంగి (36), ధనుంజయ్ టంగుల్, (25), లక్ష్మణ్ సెటి (34), ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంకు చెందిన కంగు శాంతి కుమారి (35), శ్రీలత (40) లు ఆంధ్రప్రదేశ్ అరకు నుంచి ముంబాయి వెళ్లే ఎల్టీటీ ఎక్స్ప్రెస్ రైల్లో గంజాయిని తరలిస్తున్నారు.
రైలు ఈ నెల 2న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 10వ నెంబర్ ప్లాట్ ఫారం పైకి చేరుకుంది. ఈ క్రమంలో రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టగా..అనుమానస్పదంగా కనిపించిన ఐదుగురిని తనిఖీలు చేయగా..వారి వద్ద 38 కిలోల గంజాయిని గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ముంబాయిలో ఇండ్లల్లో పని చేసుకునే వీరు ఈజీ మని కోసం అక్రమ మార్గంలో గంజాయిని విక్రయించి డబ్బులు సంపాదిస్తున్నారని పోలీసుల విచారణలో వెల్లడిందన్నారు.