బంజారాహిల్స్ : గుండెపోటుతో మృతి చెందిన ఓ యువకుడు తాను మరణించినా వేరొకరికి కంటిచూపును ప్రసాదించేలా నేత్రదానం చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిలింనగర్లో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఫిలింనగర్ దుర్గాభవానీనగర్ బస్తీకి చెందిన జంపారపు రాజు (29) బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని ఇందిరానగర్లో ఓ ప్రైవేటు సంస్థలో సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేసేవాడు. అతడికి భార్య తేజస్వనితో పాటు ముగ్గురు పిల్లలున్నారు. ఈనెల 21న స్నేహితులతో కలిసి గండిపేటలో క్రికెట్ ఆడేందుకు వెళ్లిన రాజు అస్వస్థతకు గురవడంతో సాయంత్రం 5గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు.
ఉదయం నుంచి చాతీలో నొప్పిగా ఉండడంతో గ్యాస్ట్రిక్ ట్రబుల్ కావచ్చని భావించిన రాజు స్థానికంగా ఓ ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు వెళ్లాడు. కాసేపటికే అప స్మారక స్థితిలోకి చేరుకోగా అపోలో ఆస్పత్రికి తరలించారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో రాజు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
కాగా గతంలోనే రాజు నేత్రధానం చేస్తున్నట్లు సంతకం చేసిన విషయాన్ని కుటుంబ సభ్యులు చెప్పడంతో స్నేహితులు ఈ విషయాన్ని ఎల్వీ ప్రసాద్ నేత్రవైద్య విజాన సంస్థ వైద్యులకు తెలిపారు. దాంతో ఎల్వీప్రసాద్ ఆస్పత్రినుంచి వచ్చిన వైద్యులు రాజు మృతదేహం నుంచి కండ్లను సేకరించారు.
తాను చనిపోయినా తన కండ్లు వేరొకరికి ఉపయోగపడాలనే గొప్ప ఆశయంతో నేత్రదానం చేసిన రాజు ఆశయాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.