మన్సూరాబాద్ : మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్ పాత డంపింగ్ యార్డు స్థలంలో త్వరలో ఫ్లవర్ గార్డెన్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. డంపింగ్ యార్డులో గురువారం మాజీ కార్పొ రేటర్ కొప్పుల విఠల్రెడ్డి, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీశాఖకు చెందిన ఆటోనగర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కు ప్రహారీగోడ పక్కన నూతనంగా బస్ టెర్మినల్ నిర్మిస్తున్నామని.. ఈ స్థలానికి పరిహారంగా ఆటోనగర్లోని డంపింగ్ యార్డు 42 ఎకరాల స్థలం నుంచి అటవీశాఖకు రెండు ఎకరాల భూమిని ఇవ్వనున్నట్లు తెలిపారు.
అటవీశాఖకు ఇవ్వగా మిగిలిన డంపింగ్ యార్డు స్థలం 40 ఎకరాల్లో అందమైన పూలతోటను ఏర్పాటు చేస్తామని.. ఇందులో ఎలాంటి కట్టడాలు జరుపమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరి వెంకన్న కురుమ, డివిజన్ టీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడు రుద్ర యాదగిరి, డివిజన్ టీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు పోచబోయిన జగదీష్యాదవ్, టంగుటూరి నాగరాజు, కొసనం వెంకట్రెడ్డి, నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి, టి. మోహన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.