ఆత్మకూరు(ఎం), జనవరి17 : ఆత్మకూరు(ఎం) గ్రామానికి విద్యుత్ వెలుగులు వచ్చి ఇప్పటికీ 53 ఏండ్లు పూర్తయ్యాయి. నాడు కరంట్ అంటేనే తెలియని ప్రజలు ఆముదపు దీపాలు ఏర్పాటు చేసుకునే వారు. గ్రామానికి చెందిన నాటి సర్పంచ్ ఏనుగు లింగారెడ్డితోపాటు గ్రామ పెద్దలైన శఘ్నవీసు మురళీధర్రావు, యాస రామయ్య, రచ్చ వీరనర్సయ్య, రచ్చ వెంకటయ్య, ఏనుగు ఇంద్రారెడ్డి, రామయ్య పంతులు, మొరిపిరాలకు చెందిన రామేశ్వర్రావు, కాలువపల్లికి చెందిన దంతూరి మల్లయ్య, పొలిమెరాజులబావికి చెందిన యాదగిరిరెడ్డి కలిసి నాటి రామన్నపేట శాసనసభ్యుడు వడ్డేపల్లి కాశీరామ్కు విద్యుత్ కోసం విన్నవించుకున్నారు. స్పందించిన కాశీరామ్ గ్రామ పెద్దలతో కలిసి నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని హైదరాబాద్లో కలిసి సమస్యను వివరించారు. వెంటనే ఆత్మకూరు(ఎం) గ్రామానికి కరంట్ మంజూరు చేయించారు. వలిగొండ మండలం అరూర్ గ్రామ పంచాయతీ పరిధి అప్పిరెడ్డిపల్లిలోని కట్ పాయింట్ నుంచి ఆత్మకూరు(ఎం) గ్రామం మీదుగా పొలిమెరాజులబావి వరకు ఇనుప విద్యుత్ స్తంభాలు నాటి తీగలను బిగించారు. తొలిసారిగా 1969లో గ్రామానికి కరంట్ రావడంతో మొదటగా రైతులు వ్యవసాయ బావులకు ఉపయోగించుకున్నారు. గ్రామంలో అక్కడక్కడ వీధి లైట్లను ఏర్పాటు చేయగా కేవలం పటేల్, పట్వారీ ఇండ్లల్లోనే కరంట్ వెలుగులు ఉండేవి. 1980లో మరికొంత మంది ఇండ్లకు కరంట్ సౌకర్యం రాగా 1989 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది.
పట్టుపట్టి కరంట్ను తీసుకొచ్చినం..
1969లో కరంట్ కోసం పోరాటమే చేసినం.. నాటి ప్రజాప్రతినిధులు, కరంట్ అధికారులను కలిసి పట్టుపట్టి ఆత్మకూర్కు, వలిగొండ మండలం తుర్కపల్లికి కరంట్ తీసుకొచ్చినం. 6 నెలల కృషితో ఇనుప విద్యుత్ స్తంభాలు వేసి, తీగలు బిగించి కరంట్ సరఫరా చేసిండ్రు.
మేడి రామ నర్సయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా డైరెక్టర్, ఆత్మకూరు(ఎం)
మొరిపిరాలకు 1989లో వచ్చింది..
1969లో ఆత్మకూరు(ఎం) నుంచి పొలిమెరాజులబావి వరకు కరంట్ సౌకర్యం కేవలం వ్యవసాయ బావులకు మాత్రమే ఉండేది. మొరిపిరాలకు ఎలాగైనా కరంట్ తీసుకురావాలనే పట్టుదలతో బాపూజీ యువజన మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన నేను అప్పటి విద్యుత్ శాఖ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును కలిసి సమస్యను విన్నవించినం. 1989లో మొరిపిరాలతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు విద్యుత్ వెలుగులు వచ్చినయ్.
-మామిడి మోహన్రెడ్డి, మోదుగుకుంట