ఖైరతాబాద్ : జాతీయ స్థాయిలో దివ్యాంగులకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో 9వ అవగాహన వాక్ను బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మేయర్ బండా కార్తీక రెడ్డి, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్నప్పుడే దివ్యాంగుల హక్కుల కోసం జాతీయ స్థాయిలో తన గళం వినిపించానని తెలిపారు. జాతీయ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాదిరిగా దివ్యాంగుల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని ఇటీవల కేంద్ర సోషల్ జస్టిస్ మంత్రికి లిఖిత పూర్వకంగా లేఖ రాశానన్నారు.
అందుకు బదులుగా రెండు రోజుల క్రితం తన సూచనను తప్పకుండా దృష్టిలో పెట్టుకుంటానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్నారు. దీనిని రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారన్నారు. దీనిపై తీర్మానం చేయాల్సి ఉందని, ఒక కమిషన్ ఏర్పడితే రాజ్యాంగ బద్దంగా దివ్యాంగుల హక్కులకు ఒక సాధనంగా నిలుస్తుందన్నారు.
న్యాయపరంగా వారికి ఎంతో దోహదపడుతుందన్నారు.తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి పాటుపడుతూ వారికి అండగా నిలుస్తుందన్నారు. సమాజంలో అభద్రతాభావాన్ని వీడి దివ్యాంగులు ఆత్మ స్థెర్యంతో అన్ని రంగాల్లో రాణించాలన్నారు. బండ కార్తీక రెడ్డి మాట్లాడుతూ శారీరకంగా వైకల్యం ఉన్నా వారు మానసికంగా దృఢంగా ఉన్నారన్నారు. ఏదైనా సాధించాలన్న దృక్పదం దివ్యాంగుల్లో ఎక్కువగా ఉంటుందన్నారు.
అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక అధ్యక్షులు కొల్లి నాగేశ్వర్ రావు మాట్లాడుతూ దివంగత ప్రధాని వాజ్పేయి హయాంలోనే వినోద్ కుమార్ దివ్యాంగుల కోసం పార్లమెంట్లో మాట్లాడారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా నాటి ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి కేంద్రాన్ని నిలదీశారన్నారు.
దాని ఫలితంగానే దివ్యాంగుల హక్కుల చట్టం వచ్చిందన్నారు. 21 రకాల దివ్యాంగులను గుర్తించారని, విద్యారంగంలో సైతం 3 శాతం ఉన్న రిజర్వేషన్లను 5 శాతానికి పెంచారని గుర్తు చేశారు. దివ్యాంగ కమిషన్ కూడా ఆయన కృషతో సాధించుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ చైర్మన్ ప్రేమ్ కుమార్, కోటేశ్వర్ రావు, చెన్నా రెడ్డి, దివ్యాంగుల సంఘాల నాయకులు శ్రీనివాస్, రవీందర్, గోవింద్, ఏడుకొండలు, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.