అంబర్పేట : దుర్గాభాయ్ దేశ్ముఖ్ మహిళల విద్యా వికాసం కోసం తన జీవితమంతా పనిచేసిన గొప్ప స్వాతంత్ర సమరయోధురాలని ఆమె స్పూర్తిని కొనసాగించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు.
విద్యానగర్లోని దుర్గాభాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్లో మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సీఎస్ఆర్ కింద రూ.5 కోట్లతో నిర్మించిన నూతన ఆపరేషన్ థియేటర్, ఐసీయూ భవనాన్ని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎం.ఇ.ఇ.ఎల్ డైరెక్టర్లు పి.సుధారెడ్డి, పి.రమారెడ్డి, రవిరెడ్డి, డీడీహెచ్ అండర్ ఆర్సీ చైర్మన్ ఎస్వీరావుతో కలిసి మంత్రి హరీష్రావు ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దుర్గాభాయ్ దేశ్ముఖ్ పిల్లలకు ముఖ్యంగా మహిళలకు విద్యనందించేందుకు ఎన్నో సంస్థలను ఏర్పాటు చేశారని, వైద్యం అందించేందుకు కూడా కృషి చేశారని కొనియాడారు. ఆయుస్మాన్ భారత్లో రాష్ట్ర ప్రభుత్వం చేరిందని, ఇది దవాఖానల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
దుర్గాభాయ్ దేశ్ముఖ్ దవాఖానను కూడా ఆయుస్మాన్భారత్తో పాటు మరిన్ని సేవలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందిచేందుకు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. మెగా సంస్థ అనేక సేవలు చేస్తున్నదని కొనియాడారు. నిమ్స్లో మెగా సంస్థ కోట్లాది రూపాయలు వెచ్చించి క్యాన్సర్ వార్డును, ఆపరేషన్ థియేటర్, పరికరాలను ఇచ్చారని చెప్పారు.
గాంధీ, ఉస్మానియాలతో పాటు సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలలో రోగుల సహాయకుల కోసం ఉచితంగా భోజనం అందిస్తున్నారన్నారు. కొవిడ్ సెకండ్ వేవ్లో క్లిష్టమైన సమయంలో 12 క్రియోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని సమకూర్చారని వెల్లడించారు.
ఎంత పెద్ద సంస్థ అయినా ఎంత డబ్బు సంపాదించినా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో దొరికిన ఆనందం వేరే దాంట్లో దొరకదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జస్టిస్ ఎ.నర్సింహారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ వైవీ కృష్ణారావు, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, డీడీ హాస్సిటల్ సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.