ఎల్బీనగర్ : రోషన్ దౌలా వాసులకు సత్వర న్యాయం చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి కోరారు. బుధవారం డీఆర్డీఓ డిఫెన్స్ అధికారులు, స్థానిక రోషన్దౌలా వాసులతో కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ను కలిసిన ఎమ్మెల్యే సుధీర్రెడ్డి సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణ సంస్థల పక్కనే ఉన్న రోషన్ దౌలా బస్తీలో 612 నివాసాలు ఉన్నాయని, అయితే ప్రజల భద్రత దృష్ట్యా ఈ బస్తీని ఖాళీ చేయాలని, నష్టపరిహారం చెల్లిస్తామని నోటీసులు ఇచ్చారన్నారు. 2010 సంవత్సరంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ప్రజలకు నష్టపరిహారం ఇచ్చేందుకు అంగీకరించినా కొన్ని పరిణామాల నేపథ్యంలో అలస్యం జరిగిందన్నారు.
అయితే బస్తీ వాసులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వెంటనే వారికి నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని ఎమ్మెల్యే సుధీర్రెడ్డి కోరారు. దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్ డిఫెన్స్ అధికారులతో మాట్లాడి సదరు బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని లేని పక్షంలో బస్తీల్లో ఉన్న వారికి సౌకర్యాలైనా కల్పించాలని సూచించారు.
ఈ విషయమై డిఫెన్స్ అధికారులు స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఫెన్స్ అధికారులు లక్ష్మీ నారాయణ, రుఖ్మోజీ బృందం, నాయకులు డేరంగుల కృష్ణ, బస్తీ వాసులు డి. ప్రకాశ్, లక్ష్మయ్య, ఫాస్టర్ డెవిడ్, జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.