అశ్వారావుపేట టౌన్, జనవరి 21: కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో, అశ్వారావుపేట నియోజకవర్గ కొవిడ్ నియంత్రణ ప్రత్యేకాధికారి స్వర్ణలత కోరారు. ఏమాత్రం భయాందోళనకు లోనవకుండా, అప్రమత్తంగా ఉండాలన్నారు. అజాగ్రత్త ఏమాత్రం పనికిరాదని హెచ్చరించారు. కరోనా లక్షణాలు ఉన్నట్లుగా అనిపించిన వెంటనే సమీపంలోని వైద్య సిబ్బందికి సమాచారమిస్తే.. వారే ఇంటికి మందులు తీసుకొచ్చి ఇస్తారని చెప్పారు. మండలంలో జ్వర సర్వేను శుక్రవారం ఆమె పరిశీలించారు. అశ్వారావుపేటలోని శివయ్య గారి వీధి, చిన్నంశెట్టి బజార్లో సర్వే బృందంతో కలిసి ఇంటింటి సర్వేలో పాల్గొన్నారు. ప్రజలతో ఆమె మాట్లాడుతూ.. సర్వే సిబ్బందికి పూర్తిగా సహకరించాలని కోరారు. కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుని తొమ్మిది నెలలు పూర్తయిన వారు బూస్టర్ డోస్ తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. తప్పనిసరి అయితే తప్ప బయటకు రావద్దని, మాస్క్ ధరించాలని, శానిటైజర్ వాడాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. తహసీల్దార్ చల్ల ప్రసాద్, ఎంపీవో సీతారామరాజు, ఈవో గజవెల్లి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
టేకులపల్లి: మండలంలో ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్డీవో పీడీ మధుసూదన్ రాజు అన్నారు. తొమ్మిదోమైలుతండా గ్రామంలో జ్వర సర్వేను శుక్రవారం పరిశీలించారు. వైద్య సిబ్బందితో మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి, నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆ గ్రామంలోని బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి, దాని ఆర్చ్కి శంకుస్థాపన చేశారు. సర్పంచ్ జర్పుల బిచ్చ, ఎంపీడీవో బాలరాజు, ఎంపీవో గాంధీ, ఏపీవో శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట రూరల్, జనవరి 21: మండలంలోని ఊట్లపల్లి, వేదాంతపురం, అనంతారం గ్రామాల్లో సర్వేను ఆర్డీవో స్వర్ణలత తనిఖీ చేశారు. జ్వరం, దగ్గు, ఆయాసం, జలుబు తదితర లక్షణాలు, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారి వివరాలను సర్వే బృందాలు నమోదు చేశాయి. కరోనా లక్షణాలున్న వారు ఐసొలేషన్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. సర్వేను తహసీల్దార్ చల్లా ప్రసాద్, ఎంపీవో సీతారామరాజు, వైద్యులు హరీష్, రాంబాబు పర్యవేక్షించారు.
చండ్రుగొండ: మండలవ్యాప్తంగా ఇంటింటి జ్వర సర్వే పకడ్బందీగా జరుగుతున్నది. చండ్రుగొండ పంచాయతీలో సర్వేను శుక్రవారం తహసీల్దార్ ఉషాశారద తనిఖీ చేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి సంజీవరావు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాకేష్, ఎంపీవో తోట తులసీరాం తదితరులు పాల్గొన్నారు.
దమ్మపేట: మండలంలోని గండుగులపల్లిలో సర్వేను జడ్పీటీసీ సభ్యుడు పైడి వెంకటేశ్వరరావు పరిశీలించారు.
ములకలపల్లి: మండలంలోని పూసుగూడెంలో జరిగిన సర్వేలో వైద్యాధికారి డాక్టర్ ఉదయలక్ష్మి పాల్గొన్నారు.
ఇల్లెందు: పట్టణంలో జరిగిన సర్వేలో కౌన్సిలర్లు వీణ, లక్ష్మి పాల్గొన్నారు. మండలంలోని ఒడ్డుగూడెం పంచాయతీలో కళాజాత బృందం ఇంటింటికీ తిరుగుతూ కరోనాపై అవగాహన కల్పించింది.
అన్నపురెడ్డిపల్లి: మండలంలో జ్వర సర్వేను తహసీల్దార్ భద్రకాళి, వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక పరిశీలించారు.
అశ్వారావుపేట మండలంలో50 మందికి కరోనా
అశ్వారావుపేట/అశ్వారావుపేట రూరల్, జనవరి 21: అశ్వారావుపేట మండలంలో మూడు రోజుల నుంచి కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం అశ్వారావుపేట సీహెచ్సీలో 57 మందిని పరీక్షించగా 35 మందికి, వినాయకపురం పీహెచ్సీలో 37 మందిని పరీక్షించగా 15 మందికి కరోనా సోకినట్లు ఆ వైద్యశాలల డాక్టర్లు హరీష్, రాంబాబు తెలిపారు. విధుల్లో భాగంగా నిత్యం పల్లె ప్రజల మధ్యలో తిరిగే మండల సమాఖ్య సిబ్బందిలో ఇద్దరికి కరోనా సోకింది. స్థానిక ఎన్జీబీ, ఎస్బీఐ సిబ్బందిలో కొందరు.. కొవిడ్ బాధితుల్లో చేరారు.