ఖమ్మం కల్చరల్/ కొత్తగూడెం కల్చరల్, జనవరి 14: స్వచ్ఛమైన సూర్యుడి కాంతే సంక్రాంతి. సూర్యుడి నవ్యకాంతి, దివ్యక్రాంతి లోకానికి ప్రసారమయ్యే మహత్తర సమయం పవిత్ర ఉత్తరాయణ ప్రవేశం. సూర్యుడు మకర సంక్రమణం చేసి లోకానికి సకల సౌభాగ్యాలు ప్రసాదించే మహిమాన్వితమైన రోజే సంక్రాంతి పండుగ. సూర్య భగవానుణ్ని మకర రాశిలోకి ఆహ్వానిస్తూ రథం ముగ్గులు వీధుల్లో బారులుతీరుతున్నాయి. తెనుగింట ముంగిళ్లలో సప్తవర్ణాల రంగవల్లులు ఆకట్టుకుంటున్నాయి. వాటి మధ్యలో గొబ్బెమ్మలు కొలువుదీరుతున్నాయి. హరిదాసు కీర్తనలు, బసవన్నల నాట్యాలు, పతంగుల రెపరెపలతో పల్లెల్లో పండుగ వాతావరణం ఉట్టిపడుతోంది. పాడిపంటలు, భోగభాగ్యాలు వెరసి.. ఉమ్మడి జిల్లా అంతటా సంక్రాంతి శోభ సంతరించుకుంటోంది. ఉమ్మడి జిల్లా ప్రజలందరూ శనివారం సంక్రాంతి పండుగను అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. సూర్యుడు భగవానుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి శుక్రవారం రాత్రి ఉత్తరాభిముఖుడై భూమిపైన ఉత్తరార్థ గోళంలో ప్రవేశించాడు. దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. దేవతల పగటికాలంగా చెప్పుకునే ఈ ఉత్తరాయణ కాలాన్ని శుభకార్యాలు, మంచి పనులు, దానధర్మాలు చేపట్టేందుకు ఉత్తమ కాలంగా భావిస్తారు. సంక్రాంతి పండుగ రోజున సూర్య భగవానుణ్ని ఆరాధిస్తే సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని నమ్మకం. ప్రతి ఇంటిలో సిరులునింపి సరికొత్త కాంతులు పంచే ఈ పర్వదినంలో కుటుంబ సభ్యులు తమ బంధుమిత్రులతో అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు సిద్ధమయ్యారు.
పాడి పంటల పండుగ కనుమ..
మూడు రోజుల సంక్రాంతి పండుగలో మూడోది కనుమ. దీనిని రైతు ప్రాధాన్యంగా భావిస్తారు. ఈరోజున రైతులు పశుపక్ష్యాదులను పూజిస్తారు. పాడిపంటలను తెచ్చిపెట్టే పశువులకు ఈ రోజు ఎటువంటి పనీ చెప్పకుండా, భక్తి ప్రపత్తులతో పూజిస్తారు. వ్యవసాయ పనిముట్లును శుభ్ర పర్చుకుని పూజలు చేస్తారు. పశువులను అలంకరించి, పసుపు కుంకుమలతో పూజిస్తారు. ఇళ్లన్నీ మామిడి తోరణాలతో, వాకిళ్లన్నీ రంగురంగుల రంగవల్లులతో శోభాయమానమవుతాయి. ముత్తయిదువులు కనుమ పండుగ నోమును ఆచరించనున్నారు.
వైభవంగా భోగి..
ఇండ్ల ముంగిళ్లల్లో, కూడళ్లలో పాత వస్తువులను దహనం చేస్తున్న భోగి మంటలు సూర్యుడు మకర సంక్రమణానికి స్వాగతం పలికాయి. నులి వెచ్చని భోగి మంటలు చెడును దహిస్తూ, మంచిని స్వీకరించేందుకు శ్రీకారం చుట్టాయి. వాకిళ్లలో గొబ్బెమ్మలతో కూడిన రంగవల్లులు, సూర్యరథం ముగ్గుతో సంక్రాంతిని సాదరంగా స్వాగతించారు. భోగి మంటలు, చిన్నారులకు భోగిపళ్లు పోయడం, పేరంటాల వాయనాలు, బొమ్మల కొలువులు, గాలి పటాల సందడితో భోగి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
వంటకాల ఘుమఘమలు..
ఇండ్లల్లో రాశులుగా కొత్త ధాన్యం, బంధుమిత్రుల సందడి, నోరూరించే రుచికరమైన పిండి వంటలు సంక్రాంతి పండుగ ప్రత్యేకతను చాటుతాయి. చకినాలు, కారప్పూస, అరిసెలు, నువ్వుల ఉండలు, బొబ్బట్లు, అప్పాలు, పాయసం, పరమాన్నం, చక్కెర పొంగలి, బూరెలు చేసుకుని కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి ఆరగిస్తారు.
నేత్ర పర్వం.. గోదా కళ్యాణం..
పవిత్ర ధనుర్మాస మహోత్సవంలో ఆండాళ్ తల్లి తిరుప్పావై వ్రతాన్ని ముగించుకోవడంతో శుక్రవారం భోగి పండుగ రోజున అన్ని వైష్ణవాలయాల్లో గోదా రంగనాథుల కల్యాణం కమనీయంగా జరిగింది. పలు వైష్ణవాలయాల్లో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా భోగి పర్వం నాడు కనుల పండువగా గోదా కల్యాణోత్సవం నిర్వహించారు. ఆండాళ్ తల్లి రంగనాథుడి కోసం నెల రోజుల పాటు తిరుప్పావై వ్రతాన్ని ఆచరించి, స్వామిని వరించే కమనీయ ఘట్టాన్ని పలు ఆలయాల్లో అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలోని వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఖమ్మంలోని మామిళ్లగూడెం, కమాన్బజార్ వేంకటేశ్వరస్వామి ఆలయాలు, రామాలయాలు, రంగనాయకుల గుట్ట శ్రీలక్ష్మీరంగనాథస్వామి ఆలయాల్లో అత్యంత నేత్రపర్వంగా గోదా రంగనాథుల కల్యాణం జరిగింది. గోదా రంగనాథుల కల్యాణోత్సవం సందర్భంగా వికాస తరంగిణి జిల్లా అధ్యక్షుడు పోలా శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు.