మియాపూర్ : నిరుపేద ప్రజలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పేదరికంతో అనారోగ్యాల బారిన పడుతున్న వారికి సీఎం సహాయ నిధి పథకం ఆర్థికంగా ఆదుకుంటూ వారికి భరోసాగా నిలుస్తుందన్నారు.
నియోజవకర్గంలోని చందానగర్ డివిజన్కు చెందిన కమలా బాయికి రూ. లక్ష , వివేకానందనగర్కు చెందిన అబ్బుల రాజుకు రూ. 20 వేలు సీఎం సహాయ నిధి పథకం కింద మంజూరు కాగా సదరు ఆర్థిక సాయం చెక్కులను కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, ఉప్పలపాటి శ్రీకాంత్లతో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ ఆదివారం తన నివాసంలో లబ్దిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సర్కారు కృషి చేస్తున్నదన్నారు. సీఎం సహాయ నిధి పథకం తన నిరంతర సేవల ద్వారా పేదల ప్రజలకు అండగా నిలుస్తున్నదని విప్ గాంధీ పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, పార్టీ నేతలు సంజీవరెడ్డి, శ్రీను, కాశీనాథ్యాదవ్ పాల్గొన్నారు.
కార్తీక వనభోజనాలు
వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని సప్తగిరి కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్తీక వన భోజన కార్యక్రమంలో కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావులతో కలసి విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ వాసులంతా ఒకే వేదికపై పవిత్ర కార్తీక మాసం సందర్బంగా కలుసుకోవటం శుభ పరిణామమని, ఈ తరహా సంప్రదాయాలు ప్రజలలో భక్తి భావంతో పాటు సత్సంబంధాల పెంపుకు ఉపయుక్తం అవుతాయన్నారు.
ఉరుకులు పరుగుల దైనందిన జీవితంలో సామూహిక వన భోజనాలు ప్రజలలో చక్కని అనుబంధాలను వృద్ధి చేస్తాయని, తద్వారా కాలనీ అభివృద్దికి ఈ సంఘటితం దోహదపడతాయని విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవరెడ్డి, కాలనీ వాసులు శర్మ, మాలయ్య, రాజేశ్ శ్రవణ్ పాల్గొన్నారు.