జహీరాబాద్/ మొగుడంపల్లి, జనవరి 17 : మోతీమాత దేవాలయం భక్తజనసంద్రంగా మారింది. జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. సోమవారం మొగుడంపల్లి మండలంలోని ఉప్పర్పల్లి తండాలో జరిగిన మోతీమాత జాతరలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు పాల్గొని అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.హోమ గుండాల్లో నైవేద్యం సమర్పించారు. అమ్మవారికి ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పూజలు చేశారు. ఈ జాతరకు కర్ణాటక, మహారాష్ట్రతోపాటు తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన భక్తులు హాజరయ్యారు. ఉదయం నుంచి భక్తులు దేవాలయానికి చేరుకుని అమ్మవారికి పూజలు చేశారు. జహీరాబాద్ సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, ఆత్మకమిటీ చైర్మన్ విజయ్కుమార్, రైల్వే బోర్డు సభ్యుడు షేక్ ఫరీద్, టీఆర్ఎస్ నాయకులు విజయ్మోహన్రెడ్డి, కిషన్ పవార్ పాల్గొన్నారు.
హోతి(కే) శివారులో ఉన్న అమ్మవారికి పూజలు
జహీరాబాద్ పట్టణ సమీపంలో ఉన్న భవానిమాతకు ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. హోతి(కే) శివారులో ఉన్న భవాని మాత దేవాలయానికి వెళ్లి పూజలు చేశారు. విశ్రాంతి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం జనార్దన్ పాల్గొన్నారు.