వెంగళరావునగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరుగుతుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ అన్నారు. సోమవారం సోమాజిగూడ డివిజన్లోని శ్రీనగర్ కాలనీ, శాలివాహన నగర్ కాలనీలో రూ.16 లక్షల నిధులతో చేపట్టిన వరద నీటి కాలువ మరమ్మతు పనులు పూర్తవుడంతో సోమాజి డివిజన్ కార్పొరేట్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్తో కలిసి ఆయన ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ మాట్లాడుతూ.. గత ఏడేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయని పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కొత్త పథకాలను ప్రవేశ పెట్టి పేద ప్రజలను ప్రభుత్వం ఆదుకోవడం జరిగిందని అన్నారు.
జూబ్లీహిల్స్ నియోజవర్గంలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..గతంలో వరదలు వచ్చిన సమయంలో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యేవని, వరద నీటి ముంపు సమస్యను పరిష్కరించేందుకు వరద కాలువ మరమ్మత్తుల పనులను పూర్తి చేశామని అన్నారు.
వరద నీటి కాలువ ప్రవాహంలో చెత్త చెదారం పడేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు అప్పుఖాన్, ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి మధుయాదవ్,నాయకులు తన్ను ఖాన్,శరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.