నవీపేట, జనవరి 19 : మండలకేంద్రంలోని పోలీస్స్టేషన్ పక్కన వీడీసీ ఆధ్వర్యంలో చేపట్టిన మూడు షట్లర్ల నిర్మాణాలను పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడాన్ని నిరసిస్తూ.. గ్రామస్తులు పార్టీలకతీతంగా కదం తొక్కారు. బుధవారం ఇచ్చిన బంద్లో భాగంగా మండలకేంద్రంలోని ప్రధానవీధుల గుండా ర్యాలీ నిర్వహించి బాసర రోడ్డుపై ఐదు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. భారీ సంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నవీపేటకు చెందిన ఓ యువకుడు షట్టర్ల నిర్మాణంపై ఫిర్యాదు చేయడంతో కూల్చివేసి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని పలు పార్టీలకు చెందిన నాయకులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నవీపేట జీపీ స్థలంలోనే షట్టర్ల నిర్మాణం చేపట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. పోలీసులు కూల్చి వేసిన స్థలంలోనే తిరిగి షట్టర్ల నిర్మాణం చేపట్టి, ఆరుగురు గ్రామకమిటీ సభ్యులపై పెట్టిన కేసులను ఎత్తివేసే వరకు ఆందోళనను విరమించేది లేదంటూ భీష్మించుకొని కూర్చున్నారు. నిజామాబాద్ ఏసీపీలు వెంకటేశ్వర్, ప్రభాకర్రావు, సీఐలు రవీందర్నాయక్, కృష్ణ, రవి, ఐదుగురు ఎస్సైలు, 200 మంది స్పెషల్ పార్టీ పోలీసులతో నవీపేటకు చేరుకొని ప్రజాప్రతినిధులు, వీడీసీ నాయకులతో చర్చలు జరిపారు. ఏసీపీ ఇచ్చిన హామీ మేరకు గ్రామస్తులు ఆందోళన విరమించారు.
మండలకేంద్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ఎస్సై పెంటాగౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఈ ఆందోళనలో నవీపేట, తడ్గామ్, దర్యాపూర్ గ్రామ కమిటీల పరిధిలోని వందలాది గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సమస్య పరిష్కారం కోసం కృషి : ఏసీపీ
షట్టర్ల కూల్చివేత సమస్యను సీపీ నాగరాజు దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపారు. మండల కేంద్రంలో పోలీస్స్టేషన్ పక్కన తమ శాఖ స్థలంలోనే వీడీసీ ఆధ్వర్యంలో షట్టర్ల నిర్మాణం చేపట్టారన్నారు. గ్రామస్తుల విన్నపం మేరకు షట్టర్ల నిర్మాణం చేపట్టే విధంగా కృషి చేస్తామనని హామీ ఇచ్చారు.