కూసుమంచి రూరల్, జనవరి14: రెండురోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు మండలంలో మిర్చి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. ఈ సీజన్లో మండలానికి చెందిన రైతులు 4 వేల ఎకరాల్లో మిర్చి, 5 వేల ఎకరాల్లో పత్తి సాగు సాగు చేశారు. సాగు ప్రారంభంలో మిర్చి పంట బాగానే ఉన్నా ఆ తర్వాత పంటను వైరస్ తెగుళ్లు ఆశించాయి. దీంతో మండలవ్యాప్తంగా వందలాది ఎకరాల్లో మిర్చి దెబ్బతిన్నది. రైతులు వైరస్ నివారణకు మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. పంట పెట్టుబడి పెరిగినప్పటికీ దిగుబడి గణనీయంగా తగ్గింది. మిగిలిన పంటనైనా కాపాడుకోవడానికి రైతులు ప్రయత్నిస్తున్న తరుణంలో అకాల వర్షం వచ్చింది. కల్లాల్లో ఉన్న 1,500 క్వింటాళ్ల మిర్చిని నీట ముంచింది. అలాగే వందలాది ఎకరాల్లో చేతికి వచ్చిన పత్తి దెబ్బతిన్నది. పంట నష్టపోయామని, తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
25 క్వింటాళ్ల మిర్చి నీటిపాలు..
నేను రూ.2 లక్షల పెట్టుబడి పెట్టి మూడెకరాల్లో మిర్చి సాగు చేశాను. తోటకు వైరస్ ఆశించి భారీగా దిగుబడి తగ్గింది. మిగిలిన పంటను వారం రోజుల క్రితం కోయించాను. కల్లాల్లో ఆరబెట్టగా అకాల వర్షానికి 25 క్వింటాళ్ల మిర్చి దెబ్బతిన్నది. పెట్టుబడి ఖర్చులైనా చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.