వెంగళరావునగర్ : ఆర్మీ అధికారిగా తనకు తాను పరిచయం చేసుకున్న ఓ అగంతకుడు ఇల్లు అద్దెకు కావాలంటూ యజమాని ఖాతాలో డబ్బులు స్వాహా చేశాడు. ఎస్.ఆర్.నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇన్స్పెక్టర్ సైదులు కథనం మేరకు..
సనత్నగర్ జెక్కాలనీలో గల ఈస్ట్ క్రిస్ట్ అపార్ట్మెంట్స్లో నివాసం ఉండే డాక్టర్ జి.జె.డి రావు సెల్ ఫోన్కు ఈ నెల 20వ తేదీన సాయంత్రం రెండు నంబర్ల ద్వారా ఫోన్ వచ్చింది. ఆర్మీ అధికారిగా చెప్పుకున్న ఆగంతకుడు తనకు నగరానికి బదిలీ అయిందన్నాడు. డాక్టర్ జె.డి.రావుకు చెందిన అపార్ట్మెంట్ ఫ్లాటు అద్దెకు కావాలని అడిగాడు.
తానోక క్యూఆర్ కోడ్ పంపుతానని, కోడ్ను స్కాన్ చేస్తే అద్దెకు సంబంధించిన అడ్వాన్సు డబ్బులు వస్తాయని నమ్మ బలికాడు. జి.జె.డిరావు తన సెల్ఫోన్కు వచ్చిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి, యూపీఐ నెంబరు నమోదు చేయడంతో ఖాతాలో నుంచి రెండు సార్లు రూ.10 వేల చొప్పున మొత్తం 20 వేల నగదు స్వాహా అయ్యాయి.
దీంతో తాను మోసపోయానని గ్రహించి ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.