నర్సాపూర్, జనవరి 19 : ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని జూనియర్ సివిల్ జడ్జి, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ అనిత సూచించారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలోని కోర్టు ఆవరణలో న్యాయశాఖ సిబ్బంది, న్యాయవాదులు, పోలీస్ సిబ్బందికి బూస్టర్ డోస్ టీకా వేశారు. ఈ ప్రక్రియను జూనియర్ సివిల్ జడ్జి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలందరూ నిర్లక్ష్యం చేయకుండా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ఎవరైనా కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట మెడికల్ ఆఫీసర్ ప్రియదర్శిణి, బార్ ప్రెసిడెంట్ శ్రీనివాస్గౌడ్, ఏజీపీ సత్యనారాయణ, సీనియర్ న్యాయవాదులు అంజిరెడ్డి, జాఫర్, శ్రీనివాస్, ఆర్.శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కరోనాపై అప్రమత్తంగా ఉండాలి..
రామాయంపేట, జనవరి 19 : కరోనా వైరస్ విజృంభిస్తున్నందున ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రామాయంపేట సీఐ నాగార్జునగౌడ్, మున్సిపల్ చైర్మన్ జితేందర్గౌడ్ అన్నారు. బుధవారం రామాయంపేట పోలీస్స్టేషన్లో వారు విలేకరులతో మాట్లాడారు. ప్రతిఒక్కరూ మాస్క్లు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలని తెలిపారు. ఇప్పటికే రామాయంపేట సర్కిల్ పరిధిలో కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని చెప్పారు. పెండ్లిలకు, శుభకార్యాలకు వెళ్లడం తగ్గించుకోవాలన్నారు. బయటికి వెళ్లి వచ్చినవారు చేతులు, కాళ్లు శుభ్రంగా సబ్బుతో కడుగుకొని ఇంట్లోకి రావాలన్నారు. ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. వారి వెంట ఎస్సై రాజేశ్ తదితరులు ఉన్నారు.
కొవిడ్ టీకాపై నిర్లక్ష్యం తగదు..
నిజాంపేట, జనవరి 19 : కరోనా టీకాపై నిర్లక్ష్యం తగదని, ప్రతిఒక్కరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు అన్నారు. బుధవారం మండలంలోని నస్కల్ ఆరోగ్య ఉపకేంద్రంలో ఎంపీపీ బూస్టర్ డోస్ టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీకాతో ఆరోగ్యం సురక్షితమని, మాస్క్లు ధరిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఆయన వెంట ఏఎన్ఎం రేణుక, ఆశ వర్కర్ సంతోష, అంగన్వాడీ టీచర్ మంజుల, గ్రామస్తులు ఉన్నారు.
బూస్టర్ డోస్లపై నిర్లక్ష్యం చేయొద్దు..
రామాయంపేట, జనవరి 19 : మొదటి, రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న 9 నెలలు నిండినవారు కచ్చితంగా బూస్టర్ డోస్ వేసుకోవాలని రామాయంపేట, డి.ధర్మారం వైద్యులు శివకిరణ్, ఎలిజబెత్రాణి అన్నారు. బుధవారం రామాయంపేట మండలం డి.ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫ్రంట్లైన్ వారియర్లు, హెల్త్ వర్కర్లు, 60 ఏండ్లు నిండినవారికి బూస్టర్ డోస్ వ్యాక్సిన్ టీకాలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు డోస్లు తీసుకున్నవారు నేరుగా రామాయంపేట, డీ.ధర్మా రం దవాఖానకు వెళ్లి ముందుగా తమ ఆధార్కార్డు, సెల్ఫోన్ నంబర్ ఆధారంగా ఆన్లైన్లో చెక్ చేసుకోవాలని సూచించారు. ముందుగా ఫ్రంట్లైన్ వారియర్లకు బూస్టర్ డోస్ టీకాలు వేస్తున్నమని తెలిపారు. మరోవైపు రామాయంపేటలో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి టీకా తీసుకోని వారిని గుర్తించారు.
రసాయనాల పిచికారీ..
నర్సాపూర్, జనవరి 19 : ప్రతిఒక్కరూ కరోనాపై అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి అన్నారు. బుధవారం నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కరోనా పాజిటివ్గా తేలినవారి ఇంటి ఆవరణలో మున్సిపల్ సిబ్బంది సోడియం హైపోక్లోరైడ్ మందును పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆమె వెంట శానిటరీ ఇన్స్పెక్టర్ మురళి, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.