సంగారెడ్డి, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : సంక్రాంతి పండుగ వేళ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం పదే పదే హెచ్చరిస్తున్నా జనం కొవిడ్ నిబంధనలు పాటించకుండా అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో బుధవారం 55 కరోనా కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సమాచారం ప్రకారం పటాన్చెరులో 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, సంగారెడ్డిలో 20, జోగిపేటలో మూడు, జహీరాబాద్లో మూడు, రామచంద్రాపురంలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా సోకిన 55 మందిని వైద్యులు హోంఐసొలేషన్లో ఉంచారు. కేసులు పెరుగుతుండడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పరీక్షల సంఖ్యను పెంచుతున్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లాలో మొత్తం 1534 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1274 ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారు. 260 ఆర్టీపీసీఆర్ పరీక్షలకు రక్తం నమూనాలు సేకరించారు. నారాయణఖేడ్ పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకులో అకౌంటెంట్కు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో బుధవారం బ్యాంకు లావాదేవీలను పూర్తిగా నిలిపివేశారు. బ్యాంకు అకౌంటెంట్ను సంప్రదించిన ఖాతాదారులు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని బ్యాంకు సిబ్బంది సూచించారు. ఇదిలా ఉంటే.. కంది గ్రామంలో ఉన్న ఐఐటీ హైదరాబాద్లో కరోనా కలకలం చోటు చేసుకుంది. ఐఐటీ హైదరాబాద్లో 123 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐఐటీ హైదరాబాద్లో విద్యను అభ్యసిస్తున్న 107 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో విద్యార్థులందరినీ ఐఐటీలోని హాస్టల్లో హోంఐసొలేషన్లో ఉం చారు. ఐఐటీ క్యాంపస్లో ఉన్న ఏడుగురు వైద్యు లు హోంఐసొలేషన్లో ఉన్న విద్యార్థులకు అవసరమైన చికత్స అందజేస్తున్నారు. ఐఐటీ హైదరాబాద్లోని విద్యార్థులతోపాటు ఏడుగురు బోధన సిబ్బంది, తొమ్మిది మంది బోధనేతర సిబ్బంది కరోనా పాజిటివ్ వచ్చింది. వారందరినీ హోం ఐసొలేషన్లో ఉంచారు. ఐఐటీ హైదరాబాద్లో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గాయత్రిదేవి తెలిపారు. ప్రతిఒక్క రూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.కరోనా వ్యాక్సిన్ తప్పక వేసుకోవాలన్నారు.
ఖేడ్లో ఎస్బీఐ ఉద్యోగికి కరోనా
నారాయణఖేడ్, జనవరి 12 : నారాయణఖేడ్ ఎస్బీఐలో ఓ ఉద్యోగి కరోనా బారిన పడడంతో బుధవారం బ్యాంకు సేవలు నిలిపివేశారు. సదరు ఉద్యోగికి కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్గా తేలింది. దీంతో బ్యాంకును శానిటైజ్ చేసే నిమిత్తం బుధవారం సేవలు నిలిపివేసినట్లు బ్రాంచ్ మేనేజర్ మిలింద్ కామ్లే తెలిపారు. గురువారం యధావిధిగా బ్యాంకు సేవలు కొనసాగుతాయన్నారు.
-బ్యాంకు సేవలు నిలిపివేత
కోహీర్లో ముగ్గురికి..
కోహీర్, జనవరి 12 : మండల కేంద్రమైన కోహీర్లోని ప్రభుత్వ దవాఖానలో బుధవారం 12 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ముగ్గురికి కరోనా పాజిటివ్గా తేలింది. దిగ్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 45 మందికి పరీక్షలు నిర్వహించగా, అందరికీ కూడా నెగెటివ్ ఫలితాలు వచ్చినట్లు మండల వైద్యాధికారి రాజ్కుమార్ తెలిపారు.