సిద్దిపేట టౌన్, జనవరి 17 : అమాయకులను మాయమాటలతో బుట్టలో వేసుకొని వారి డబ్బులను కొల్లగొడుతున్న సైబర్ కేటుగాళ్ల ఎత్తులను చిత్తు చేస్తూ పోలీసులు చెక్ పెడుతున్నారు. బాధితులు ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే జాతీయ హెల్ప్లైన్ నంబర్ను అస్త్రంగా చేసుకుని పోగొట్టుకున్న డబ్బులను వెనక్కి రప్పిస్తూ న్యాయం చేస్తున్నారు. సిద్దిపేట పోలీసులు తమదైన చతురతను ప్రదర్శిస్తూ సైబర్ నేరాలను ఛేదిస్తున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట పోలీసు కమిషనర్ శ్వేత సోమవారం మాట్లాడారు. సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ నెల 14న బాధితులు ఫిర్యాదు చేసిన 24 గంటల్లో సైబర్ నేరాలను ఛేదించామన్నారు. గజ్వేల్ కొల్గూరు గ్రామానికి చెందిన జగ్గారి మనోజ్కుమార్ ఫేస్బుక్లో గుర్తు తెలియని వ్యక్తి హైదరాబాద్లో కుక్కలు అమ్మకానికి ఉన్నాయని పోస్టు పెట్టాడు. అందులో ఉన్న ఫోన్ నంబర్ను చూసి బాధితుడు మనోజ్కుమార్ అతడికి కాల్ చేశాడు. వెంటనే స్పందించిన నేరస్తుడు వివిధ రకాల కుక్కలను చూపించాడు. అందులో మనోజ్కుమార్ రూ.6 వేల ఒక డాగ్ను అతనితో బేరం కుదుర్చుకున్నాడు. డెలివరీ చార్జీలు ముందుగానే చెల్లించాలని తెలుపగా ఫోన్పే ద్వారా రూ.3500 పంపించాడు. దానికి రిైప్లె ఇస్తూ అమౌంట్ రాలేదని మరోసారి పంపించమని కోరాడు. ఇలా మొత్తం రూ.7 వేలను సైబర్ నేరగాడు ఖాతాలో వేయించుకున్నాడు. కొంత సేపటి తర్వాత మనోజ్కుమార్ అతనికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. అదే విధంగా సిద్దిపేట హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన అజయ్కుమార్ ఫేస్బుక్లో యాక్టివ్ 4జీ అమ్మకానికి ఉందని గుర్తు తెలియని వ్యక్తి పోస్టు పెట్టాడు. అందులో ఉన్న నంబర్కు ఫోన్ చేయగా రూ.11 వేలకు విక్రయిస్తానని చెప్పగా అజయ్కుమార్ బేరం కుదుర్చుకున్నాడు. డెలివరీ చార్జీలు పంపాలని చెప్పగా మూడు విడుతలుగా రూ.3,436 పంపాడు. సిద్దిపేట కుశాల్నగర్కు చెందిన అర్జున్రెడ్డి స్నేహితుడి ఫొటోతో ఫేస్బుక్కు రిక్వెస్టు రాగా దానిని ఆక్సెప్ట్ చేసి తర్వాత ఫోన్ నంబర్ ద్వారా అతడికి ఫోన్ చేసి అడుగగా అత్యవసరంగా రూ.15 వేలు అవసరం ఉన్నాయని, త్వరగా పంపించాలని అర్జున్రెడ్డిని కోరాడు. బాధితుడు ఫోన్ ద్వారా రూ.500 పంపించాడు. తర్వాత అర్జున్రెడ్డి ఫేస్బుక్లో సెర్చ్ చేయగా అందులో గుజరాత్, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు చెందిన చిరునామాలు ఉన్నాయి. ఇలా ముగ్గురు సైబర్ నేరస్తుల చేతిలో రూ.11 ,936 పోగొట్టుకున్నారు. వీరు ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే స్పందించామని సీపీ శ్వేత చెప్పారు. సైబర్ నేరస్తుల ఖాతాల్లో డబ్బులు ఉన్నప్పుడు బ్యాంకు అధికారులను అప్రమత్తం చేసి వాటిని ఫ్రీజ్ చేశామన్నారు. ఇప్పటి వరకు సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలో రూ.13,52,969 ఫ్రీజ్ చేశామన్నారు. త్వరలోనే బాధితుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయని చెప్పారు. సైబర్ నేరాల్లో డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే జాతీయ హెల్ప్లైన్ టోల్ ఫ్రీ నంబర్ 155260 లేదా 112 లేదా 100 ఫోన్ చేయాలని సూచించారు. సైబర్ నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తేనే ఇలాంటి కేసులు ఛేదించవచ్చని తెలిపారు. సైబర్ నేరస్తుల వలకు చిక్కవద్దని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.