చిలిపిచెడ్, జనవరి 19 : వరి సాగు చేస్తున్న రైతులు వరుస నష్టాలతో అప్పులపాలవుతున్నారు. ఏటా దిగుబడులు తగ్గుతుండడంతోపాటు పెట్టుబడులు తడిసి మోపెడవుతున్నాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగులో సాంకేతికత లేకపోవడం, రైతుల్లో అవగాహన లోపం, చీడపీడల ఉధృతి, దిగుబడి తగ్గడానికి ప్రధాన కారణాలుగా వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. నాణ్యమైన దొడ్డు రకం వరి వంగడాల సాగుతో ఎకరానికి గరిష్టంగా 32 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తున్నది. కానీ, మూడు సీజన్ల నుంచి కనిష్టంగా 20 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందని రైతులు వాపోతున్నారు. 2020 యాసంగిలో పంటకు చీడపురుగులు ఆశించడంతో దిగుబడి తగ్గింది. ఆకాల వర్షాలతో పంట దెబ్బతిని రైతులు కష్టాలపాలయ్యారు. ప్రస్తుత సీజన్లో సైతం విస్తృతంగా వర్షాలు కురిసి పలుచోట్ల పంటలు నీటమునిగి దిగుబడి తగ్గినట్లు రైతులు పేర్కొంటున్నారు. ఎకరం భూమిలో వరి పండించడానికి రైతులకు రూ.30 వేల పైనే ఖర్చవుతుంది. ఎకరానికి సగటు 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా పెట్టుబడులు పోను రైతుకు మిగిలేది రూ.18 వేలు మాత్రమే.
దిగుబడి తగ్గడానికి కారణాలు..
ఏండ్ల తరబడి పంట మార్పిడి పాటించకపోవడంతో భూసారం తగ్గి దిగుబడులు తగ్గుతున్నాయి. వరికి బదులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి. దీంతో భూసారం పెరిగి దిగుబడులు పెరగడమే కాకుండా నీరు, రసాయన ఎరువుల వినియోగం తగ్గుతుంది.