వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ‘మన ఊరు- మన బడి/ మన బస్తీ- మన బడి’ కార్యక్రమం అమలును వేగవంతం చేసింది. తొలి విడుత ఎంపికైన స్కూళ్లల్లో అవసరాల గుర్తింపు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నది. పనులు చేపట్టేందుకు ఇంజినీర్లు అంచనాలు తయారు చేస్తున్నారు. పాలనాపరమైన అనుమతులు పొందడానికి మనఊరు- మన బడి(ఎంవోఎంబీ) యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. తొలుత పైలట్ ప్రాజెక్టు కింద 26 పాఠశాలల్లో పనులు జరుగనున్నాయి.
వరంగల్, ఏప్రిల్1(నమస్తేతెలంగాణ) : వారం రోజుల్లో జిల్లాలో ‘మన ఊరు- మన బడి’ పనులను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో 645 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిని మూడు దశల్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తొలివిడుత 223 పాఠశాలలను ఎంపిక చేసింది. వీటిలో 123 ప్రాథమిక, 20 ప్రాథమికోన్నత, 80 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మౌలిక వసతులు కల్పించి వీటిని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు అధికారులు ఆయా పాఠశాలల ఎస్ఎంసీ చైర్మన్లు, ప్రధానోపాధ్యాయులు, ప్రజాప్రతినిధులతో పాఠశాల, మండల, జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించారు. మన ఊరు-మన బడి కార్యక్రమం అమలుకు ప్రభుత్వం జారీ చేసిన విధివిధానాలను వివరించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, దాతలు, పూర్వ విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని చెప్పారు.
మన ఊరు-మన బడి కార్యక్రమం పనుల పర్యవేక్షణకు కలెక్టర్ గోపి మండలానికో ఇంజినీరింగ్ విభాగాన్ని కేటాయించారు. ఈ కార్యక్రమం అమలుకు మండలానికో జిల్లా స్థాయి అధికారిని స్పెషల్ ఆఫీసర్గా నియమించారు. ఇంజినీరింగ్ అధికారులు ఎస్ఎంసీ చైర్మన్, ప్రధానోపాధ్యాయుడు, సర్పంచ్తో కలిసి తొలి విడుత ఎంపికైన పాఠశాలల్లో పన్నెండు అంశాలపై అవసరాలను గుర్తిస్తున్నారు. వీటి ఫొటోలను ఎంవోఎంబీ యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ)లు పాఠశాల వారీగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎస్టిమేట్స్ తయారు చేస్తున్నారు. వీటిని ఎంవోఎంబీ యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. కలెక్టర్ నుంచి పాలనాపరమైన అనుమతులు తీసుకుని పనులను మొదలు పెట్టే బిజీలో ఉన్నారు. ఇప్పటికే తొలి విడుత అభివృద్ధి చేసే పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ), డోనర్స్ పేర బ్యాంకు ఖతాలను తెరవడం పూర్తయింది. పాఠశాల పనుల లావాదేవీల కోసం ఒకటి, సేకరించిన విరాళాల వినియోగం కోసం మరొకటి ఇలా 223 పాఠశాలల్లో 446 బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఎస్ఎంసీ చైర్మన్, ప్రధానోపాధ్యాయుడు, సర్పంచ్, ఏఈ పేర్లతో ఒక ఖాతా, ఎస్ఎంసీ చైర్మన్, ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు పూర్వ విద్యార్థుల పేర్లతో మరో ఖాతాను ఓపెన్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వ ఆదేశాలతో వారం రోజుల్లో పాఠశాలల్లో మన ఊరు- మన బడి కార్యక్రమం అభివృద్ధి పనులు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే అంచనాలు తయారు చేయడం పూర్తయిన పాఠశాలల జాబితాను పరిశీలించారు. మండలానికి రెండేసి చొప్పు న పదమూడు మండలాల్లో 26 పాఠశాలలను పైలట్ ప్రాజెక్టు కింద గుర్తించారు. వారం రోజుల్లో పైలట్ ప్రాజెక్టు స్కూళ్లలో పనులు మొదలుపెట్టనున్నారు. పాలనపరమైన అనుమతులు జారీ కాగానే పనులు షురూ అయ్యే స్కూళ్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద ప్రభుత్వం డబ్బు ఇవ్వనుంది. కొన్ని పాఠశాలలను కలెక్టర్ బీ గోపి నాలుగు రోజుల క్రితం సందర్శించారు. తన వెంట ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతితో పాటు ఇతర అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యాశాఖ నుంచి ఈ కార్యక్రమం అమలును డీఈవో వాసంతి పర్యవేక్షిస్తుండగా ప్లానింగ్ సెక్టోరియల్ అధికారి సుధీర్బాబు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు.