షాబాద్, ఫిబ్రవరి 15 : ప్రజల కంటి సమస్యలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న కంటి వెలుగు క్యాంపులకు మహిళలు, వృద్ధులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 16,836 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు సంబంధిత వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా క్యాంపులు సజావుగా కొనసాగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 80 బృందాల ద్వారా వైద్యసిబ్బంది తమకు కేటాయించిన గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు చేస్తున్నారు. అవసరమున్న వారికి కంటి అద్దాలతో పాటు మందులు ఉచితంగా అందిస్తున్నారు.
చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో 16,836 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 2,100 మందికి కంటి అద్దాలు అందజేశారు. 1,547 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కంటి వెలుగు కేంద్రాలను సందర్శించి వైద్యసిబ్బందికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వందరోజుల పాటు జరిగే రెండో విడుత కంటి వెలుగును విజయవంతం చేయాలని సూచిస్తున్నారు.
బొంరాస్పేట : అంధత్వం, కంటి జబ్బుల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. నేత్ర సంబంధిత వ్యాధులతో వచ్చినవారికి జిల్లాలోని 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కంటి సమస్యలతో వచ్చేవారికి చుక్కల మందుతో పాటు విటమిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునేలా చైతన్యం చేస్తున్నారు. ప్రజలు ఉత్సాహంగా శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేసి కళ్లద్దాలు పంపిణీ చేస్తుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మండలాల నోడల్ అధికారులు కంటి వెలుగు శిబిరాలను సందర్శించి పర్యవేక్షిస్తున్నారు. బుధవారం జిల్లాలో 5899 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 981 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 761 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు 102 గ్రామాలు, 27 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలను నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.
కంటి వెలుగు శిబిరాలను గ్రామాల్లో ఏర్పాటు చేయడంతో మాలాంటి వారికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇంతటి మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. గతంలో కంటి పరీక్షలు చేసుకోవాలంటే పట్టణాలకు పోయేది. ప్రస్తుతం ఆ బాధ తప్పింది. ఊరికే వచ్చి పరీక్షలు చేసి, అద్దాలు మందులు అందిస్తారనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది.
– ఏ.కిష్టయ్య, తంగడిపల్లి, చేవెళ్ల మండలం