అంబర్పేట : కరోనా, ఒమిక్రాన్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం సోమవారం నుంచి బూస్టర్ డోసును ఇస్తున్నదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందుగా 60 ఏళ్లు పై బడిన వారు, హెల్త్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లకు, మొదటి, రెండో డోసు తీసుకొని 9 నెలలు పూర్తయిన వారికి ఈ బూస్టర్ డోసును ఇస్తున్నట్లు చెప్పారు.
అంబర్పేట నియోజకవర్గంలోని తిలక్నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డా.కాలేరు దీప్తిపటేల్తో కలిసి బూస్టర్ డోసును సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనతో ఈ వ్యాక్సిన్ ఇస్తున్నట్లు చెప్పారు.
నియోజకవర్గంలోని తిలక్నగర్ యూసీహెచ్సీ, బాగ్అంబర్పేట,, ఏఎంఎస్ యూపీహెచ్సీలలో ఈ వ్యాక్సిన్ డోసులు ఇస్తున్నట్లు తెలిపారు. 60 ఏళ్లు నిండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.