చాదర్ఘాట్ : బీబీ కా ఆలం ఊరేగింపు ప్రశాంతంగా ముగిసేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. చాదర్ఘాట్ వద్ద ఉన్న ప్రత్యేక ప్రార్ధన కేంద్రంలో ఆలం లను నిమజ్జనం చేయడంతో ఊరేగింపు ముగియనుంది. ఈ నేపథ్యంలో చాదర్ఘాట్లోని నిమజ్జన ప్రార్ధన స్థలం వద్ద నాలుగుఅంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. పోలీసులు అధికారులు. ముందుగా ప్రదాన రోడ్డు పై రోప్ పార్టీ, ఆ తరువాత బారీకేడింగ్ ఏర్పాటు చేయనున్నట్లు చాదర్ఘాట్ ఇన్స్పెక్టర్ సతీష్ తెలిపారు. కొంత దూరంలో ప్రధాన కేంద్రం వద్ద మెటల్ డిటెక్టర్, ప్రవేశ మార్గం వద్ద అదనపు బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. డబీర్పురా లోని అసుర్ఖానా నుంచి ఆలం ల ఊరేగింపు ప్రారంభమై పాతబస్తీలోని వివిధ ప్రాంతాల మీదుగా రాత్రి దాదాపు ఏడు గంటల సమయంలో చాదర్ఘాట్ నిమజ్జన కేంద్రానికి చేరుకుంటుంది.
250 మంది సిబ్బందితో బందోబస్తు… అవగాహన కల్పించిన ఉన్నతాధికారులు
బీబీకా ఆలం ఊరేగింపు సందర్భంగా చాదర్ఘాట్లోని నిమజ్జన కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. 250 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వీరికితోడు టాస్క్ఫోర్స్ పోలీసులు, అదనపు బలగాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. కాగా, పోలీస్ సిబ్బందికి ఉన్నతాధికారులు బందోబస్తు పై అవగాహన కల్పించారు. బందోబస్తులో భాగంగా చేపట్టాల్సిన చర్యల గురించి వివరించారు. ఈస్ట్ జోన్ డీసీపీ, జాయింట్ కమీషనర్ రమేశ్, సుల్తాన్బజార్ ఏసీపీ దేవేంధర్, చాదర్ఘాట్ ఇన్స్పెక్టర్ పి.సతీష్ లు బందోబస్తు ఏర్పాట్ల గురించి వివరించారు.