భానుడు ఉగ్రరూపం దాల్చాడు.. రోహిణి కార్తెలో రోళ్లు పగిలేలా విరుచుకుపడుతున్నాడు.. ఉదయం 10 గంటలు దాటకముందే తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.. ఒకవైపు ఎండ.. మరోవైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.. బొగ్గు బావులు భగ్గుమంటున్నాయి.. మధ్యాహ్నం రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.. సోమవారం నేలకొండపల్లి మండలంలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు, వడగాడ్పులతో అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఖమ్మం, మే 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):ఉమ్మడి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయంటూ పెద్దలు చెప్పినమాట కళ్లకు కన్పిస్తున్నట్లుగా ఉంది. ఈ కార్తె ప్రవేశించిన నాలుగు రోజుల్లోనే జిల్లాలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తుండడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 40 – 47 డిగ్రీల మధ్య నమోదవుతుండడంతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా పట్టపగలే కర్ఫ్యూ వాతావరణం కన్పిస్తోంది. దీంతో అత్యవసర పనులు ఉన్నా తగిన జాగ్రత్తలు లేకుండా జనం బయటకు రావడం లేదు. ఎండతీవ్రతకు భయపడి అసంఘటిత రంగ కార్మికులు పనుల్లోకి రావడం లేదు. ఉపాధి హామీ కూలీలు కూడా ఉదయం 9 గంటల్లోపే పనులు ముగించుకొని ఇళ్లకు వెళ్తున్నారు. సాయంత్రం 6 దాటితేనే వ్యాపార కేంద్రాల్లో జనం కన్పిస్తున్నారు. ప్రధాన వ్యాపార కేంద్రాల్లో పెద్దగా రద్దీ ఉండడం లేదు. కానీ రహదారుల వెంట ఉంటూ చల్లని పానీయాలు విక్రయించే చిన్న చిన్న వ్యాపారులకు మాత్రం సీజనల్ వ్యాపారం కలిసొస్తోంది. గ్రానైట్ పరిశ్రమలకు నిలయమైన ఖమ్మం జిల్లాలోనూ, బొగ్గు గనుల ప్రాంతమైన భద్రాద్రి జిల్లాలోనూ ఎండలు మండిపోతున్నాయి. నెల రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఉదయం 7 గంటలకే ఎండ వేడిమి తీవ్రమవుతోంది. సాయంత్రం 6 గంటల వడగాడ్పులు తగ్గడం లేదు. తాజాగా సోమవారం నేలకొండపల్లి, కొత్తగూడెంలలో 44 డిగ్రీలు, ఖమ్మంలో 43 డిగ్రీల చొప్పున అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే క్రమంలో శీతల పానియాల ధరలు అమాంతం పెరిగాయి. గత నెలలో రూ.20గా ఉన్న కొబ్బరి బొండాం ధర, ప్రస్తుతం రూ.30 పలుకుతోంది.
ఎండవేడిమిని తట్టుకోలేక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడంతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఆరోగ్యం బాగలేక చంటి బిడ్డలను చంకనెత్తుకొని ఖమ్మంలో ఆసుపత్రులకు వచ్చేవారు మాత్రం ఎండకు తాళలేకపోతున్నారు. ఇక ఇళ్లలో కూలర్లు, ఏసీల వినియోగం అమాంతం పెరిగిపోయింది.
అధిక శరీర ఉష్ణోగ్రత, శరీరం పోడిబారడం, దప్పిక ఎక్కువగా కావడం, వాంతులు కావడం, నీరసం, దడ, ఆయాసం, గుండె వేగంగా కొట్టుకోవడం, కన్ఫ్యూజన్, చిరాకు వంటివి వడదెబ్బ ప్రాథమిక లక్షణాలు. చివరిగా స్పృహ కోల్పోవడం ప్రధాన లక్షణం.
వేసవిలో సాధ్యమైనంత వరకు నీడపట్టున ఉండే విధంగా చూసుకోవాలి. అత్యవసరమైతే తప్ప ఆరుబయట పనులకు వెళ్లకూడదు. రోజువారీ కష్టం మీద బతికే శమజీవులు అధికంగా వడదెబ్బకు గురవుతుంటారు. సున్నం బట్టీలు, గృహ నిర్మాణ పనుల కార్మికులు, వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే కూలీలు అత్యధికంగా వడదెబ్బ భారిన పడుతుంటారు. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా సాధారణ ప్రజలూ వడదెబ్బకు గురవుతున్నారు. అయితే దీని నుంచి రక్షణ పొందేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. పండ్లు, మజ్జిగ, తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవాలి. ఎండలో బయటి నుంచి వచ్చిన వెంటనే తీపి పదార్థాలు, తేనె వంటివి తీసుకోకూడదు. పుచ్చకాయ రసంలోగా కానీ, బార్లీ జావలో పటిక బెల్లం కలిపిగానీ, లేక కొబ్బరినీళ్లు కలిపి కానీ మెల్లమెల్లగా తాగాలి. సూర్యరశ్మిని గ్రహించే గాఢమైన రంగుల దుస్తులు ధరించకూడదు. వదులైన తెల్లని రంగు దుస్తులను ధరించాలి. తలపై విధిగా టోపీ లేదా తలపాగా గానీ ధరించాలి. గొడుగును వెంట తీసుకెళ్లాలి. బయటకు వెళ్లేముందు బాగా నీళ్లు తాగాలి. శరీరానికి చలువచేసే ఉప్పు కలిపిన మజ్జిగ లేదా గ్లూకోజ్ కలిపిన నీరు తాగాలి. ఓరల్ రీ హైడ్రేషన్ సాల్ట్ తాగొచ్చు. నిమ్మరసం, చెరకు రసం లాంటివి ఎంతో మేలు.
వడదెబ్బ అనేది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. దీనికి అత్యవసరంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. కొద్దిపాటి జాగ్రత్తలతో కూడిన ప్రథమ చికిత్సతో చాలా త్వరగా కోలుకునే అవకాశం ఉంది. వడదెబ్బకు గురైన వ్యక్తిని మొదటగా వెంటనే నీడకు చేర్చాలి. బిగుతుగా ఉన్న వస్ర్తాలను వదులు చేయాలి. శరీరానికి బాగా గాలి తగిలేలా చూడాలి. వ్యక్తి చుట్టూ గుంపుగా పోగైన వారిని దూరంగా తొలగించాలి. అందుబాటులో ఫ్యాన్ ఉంటే ఆ వ్యక్తికి బాగా గాలి తగిలేలా అమర్చాలి. పరిశుభ్రమైన ఉన్ని వస్ర్తాన్ని చల్లని నీళ్లలో ముంచి శరీరానికి బాగా అద్దాలి. ఉప్పు కలిపిన చల్లని నీరు, మజ్జిగ, గంజి లేదా గ్లూకోజ్ నీళ్లు వంటివి తాగించాలి. ఇలా చేయడం వల్ల చాలా వరకు బాధితుడి శరీరంలోని వేడి తగ్గే అవకాశం ఉంటుంది.
శరీరం అధిక ఉష్ణోగ్రతకు గురైనప్పుడు తగులుతుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల మన శరీరంలో శారీరక పరమైన, నాడీ పరమైన సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా మన శరీరంలో జరిగే రసాయన చర్యల వల్ల వేడి ఉత్పత్తి అవుతుంది. అలా ఉత్పత్తి అయిన ‘వేడి’ మన శరీరంలోని ‘ఉష్ణ సమతుల్యత’ను కాపాడే చర్మం ద్వారా చెమటరూపంలో బయటకు వస్తుంది. కానీ మన శరీరం అధిక ఉష్ణోగ్రతకు గానీ, డీ హైడ్రేషన్కు గానీ గురైనప్పుడు రక్షణ మార్గాలైన చర్మం, ఊపిరితిత్తులు సరిగా పని చేయవు. దాని వల్ల శరీర ఉష్ణోగ్రత ఒక్కసారి అధిక స్ధాయికి చేరుకుంటుంది. దీనినే వడదెబ్బ లేదా హీట్ స్ట్రోక్ లేదా సన్ స్ట్రోక్ అంటారు.