సుజాతనగర్, జనవరి 30: సాంకేతికత రోజురోజుకూ తన పరిధిని విస్తరించుకుంటున్నది. చేతిలో ఒక స్మార్ట్ఫోన్ ఉంటే చాలు.. అరచేతిలో ప్రపంచం ఉన్నట్లే. ఫోన్ బిల్లు, పవర్ బిల్లుల చెల్లింపు సౌకర్యం నుంచి వినోదం, విద్య.. అన్నీ సౌకర్యాలను సెల్ఫోన్ ఇస్తున్నది. మానవ అవసరాలకు సాంకేతికత ఎంతో అవసరం. విద్య, వైద్యం, నిర్మాణ రంగం, పారిశ్రామిక రంగం.. ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా సాంకేతికత ప్రభావం వాటిపై ఉంటుంది. సాంకేతికతను జాగ్రత్తగా వినియోగించుకుంటే భేష్. కానీ అవసరానికి మించి మొబైల్ వినియోగం అనర్థదాయకం. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువగా మొబైల్కు బానిసలవుతున్నారు. ఎక్కువ సేపు వీడియో గేమ్స్, యూట్యూబ్ వీడియోస్ చూడడం వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నది. పిల్లల్లో కంటి చూపు మందగించడంతో పాటు ఇతర మానసిక రుగ్మతలు వస్తున్నాయి. ఫోన్లకు అలవాటైన కొందరు చిన్నారులు బయటి ప్రపంచాన్ని మరచిపోతున్నారంటే ఆశ్చర్యమేమీ లేదు.
కట్టడి కీలకం..
గంటల తరబడి పిల్లలు స్మార్ట్ ఫోన్ వినియోగించకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి. సున్నితంగా పిల్లలకు నచ్చజెప్పాలి. పుస్తక పఠనం, క్రీడలపై ఆసక్తి పెంచాలి. డిజిటల్ లెర్నింగ్, ఆన్లైన్ తరగతులతో రోజురోజుకు పుస్తకానికి ప్రాధాన్యం తగ్గుతుంది. తరగతుల వరకు మొబైల్స్ అందుబాటులో ఉంచి ఆ తర్వాత పక్కన పెట్టేలా పెద్దలు జాగ్రత్త వహించాలి. వీడియోస్ చూడడానికి, మొబైల్లో గేమ్స్ ఆడడానికి రోజుకు ఒక అరగంట సమయం ఇస్తే సరిపోతుంది.
వినిపించని చందమామ కథలు…
గతంలో చిన్నారులు పాఠశాల ముగియగానే ఇంటి వద్ద అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య పంచన చేరేవారు. వారు చెప్పే పేదరాశి పెద్దమ్మ కథలు, పంచతంత్రం వంటి నీతి కథలను శ్రద్ధగా వినేవారు. దీంతో పిల్లల్లో వినికిడి సామర్థ్యం పెరిగేది. ఏకాగ్రత వచ్చేది. నీతి కథల ద్వారా నైతిక విలువలు నేర్చుకునేవారు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నానాటికీ పతనమవుతున్న నేపథ్యంలో చిన్న కుటుంబాలు ఏర్పడుతున్నాయి. చిన్న కుటుంబాలు పెరగడంతో పిల్లలకు కథలు చెప్పేవారు కరువయ్యారు. నేటి పిల్లలు పాఠశాలల నుంచి రాగానే టీవీ, మొబైల్ ఫోన్లకు అతక్కుపోతున్నారు.
అనారోగ్య సమస్యలివీ..
ఎక్కువ సేపు మొబైల్ చూడడం వల్ల చూపు క్రమంగా మందగిస్తుంది. రేడియేషన్ ప్రభావం మెదడుపై పడుతుంది. తత్ఫలితంగా మెదడు పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది. గంటలు గంటలు మొబైల్ చూసే పిల్లల్లో నిద్రలేమి సమస్య తలెత్తుతున్నదని శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. హెడ్ఫోన్స్ వినియోగం కూడా పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నది. గంటల తరబడి హెడ్సెట్స్ వాడడం పిల్లల్లో వినికిడి సమస్యలను తెస్తున్నది.
పిల్లల ఆరోగ్యంపై ప్రభావం..
ఎక్కువసేపు మొబైల్ వినియోగం పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చిన్నారులు వాస్తవిక ప్రపంచానికి దూరమవుతున్నారు. తల్లిదండ్రులతో అనుబంధం తగ్గిపోతున్నది. తల్లిదండ్రులు, సంరక్షకులు చిన్నారులను మొబైల్ వాడకంలో కట్టడి చేయాలి. వారి కోసం రోజూ కొంత సమయం కేటాయించాలి. అప్పుడే పిల్లలు నైతిక విలువలు నేర్చుకుంటారు. జీవితంలో ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు.