తెలుగు సంవత్సరాదికి స్వాగతం
నేడు ఉగాది పర్వం
కరోనా నేపథ్యంలో ప్రసార మాధ్యామాల ద్వారా పంచాంగ శ్రవణాలు
కొత్తగూడెం కల్చరల్, ఏప్రిల్ 12: శ్రీచైత్రశుద్ధ పాఢ్యమి మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉగాది పండుగను జరుపుకోనున్నారు. తెలుగువారు జరుపుకునే పండుగల్లో ఉగాది ముఖ్యమైనది. ఉగాది నాడు తెలుగు సంవత్సరం మొదలవుతుంది. తెలుగువారి మొదటి పండుగ ఇది. తెలుగు వారికి కొత్త సంవత్సరం చైత్రమాసంతో ప్రారంభమవుతుంది. అదే కాలక్రమంలో ఉగాదిగా మారింది. ఏ పూర్ణిమ అయితే చిత్తా నక్షత్రంతో కూడి ఉంటుందో అదే చైత్రమాసం. చైత్రమాసపు శుక్లపక్షంలో మొదటి సూర్యోదయ కాలం చైత్ర మాసం మొదటి రోజు ఉగాది.
మాధ్యమాల పంచాగ శ్రవణం..
తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు భాగాల మిళితం పంచాంగం. పంచాంగ శ్రవణం గంగాస్నాన ఫలంతో సమానం. పంచాగ శ్రవణంలో ఆయా రాశిఫలాలు, నామ నక్షత్రాలు అనుసరించి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య, అవమానాలు ఉంటాయి. పంచాంగ శ్రవణం వినడం మంచిదని పెద్దలు చెబుతారు. సాధారణంగా ఆలయాల ప్రాంగణాలు, ఇతర ఆధ్యాత్మిక కేంద్రాల్లో కవి సమ్మేళనాలు, పంచాగం శ్రవణాలు నిర్వహిస్తారు. కాగా ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో బహిరంగ ఉత్సవాల నిషేధంతో జిల్లాలో ఎక్కడ కూడా సామూహిక పంచాగ శ్రవణాల నిర్వహణకు అనుమతి లేదు. ప్రసార మాధ్యమాల ద్వారా పంచాగ శ్రవణాలను ఆలకించనున్నారు. తెలుగు రాష్ర్టాల్లో అతి పెద్దదైన ఈ పండుగ కరోనా నేపథ్యంలో ఇళ్లలోనేజరుపుకోవడం ఇది రెండోసారి.
ఆరోగ్యప్రదాయిని.. ఉగాది పచ్చడి..
ఉగాది పచ్చడి సేవనం ఆరోగ్యదాయకం. మానవునికి ప్రకృతితో అవినాభావ సంబంధం ఉగాది పచ్చడి షడ్రుచులలోనే ఉంది. జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలు, ఆటుపోట్లకు ప్రతీకగా ఆరు రుచులను మేళవించి, ప్రసాదంగా తీసుకునే పచ్చడి ప్రాధాన్యం. ఉప్పు, వేపపువ్వు, కొత్త చింతపండు, బెల్లం, అరటి పండు, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్లతో తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే రుచులతో దీనిని తయారు చేస్తారు. ఈ పచ్చడిలో ఉండే ఒక్కో పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక.