దమ్మపేట రూరల్/ సత్తుపల్లి, ఫిబ్రవరి 1: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిసర ప్రాంతంలోని రేగళ్లపాడు- చంద్రాయపాలెం అటవీ ప్రాంతం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలంలోని జగ్గారం అటవీప్రాంతానికి పెద్ద పులి వెళ్తున్న దృశ్యాలను మంగళవారం అటవీశాఖ అధికారులు సీసీ కెమెరాల్లో బంధించారు. ఈ మేరకు ఎఫ్డీవో వేమూరి సతీశ్కుమార్ ధ్రువీకరించారు. దీంతో పులి సంచారం వాస్తవమేనని రుజువైంది. దమ్మపేట అటవీశాఖ రేంజర్ శ్రీనివాసరావు, సిబ్బంది సమీప గ్రామాలకు వెళ్లి ప్రజలను అప్రమత్తం చేశారు. వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు అటవీప్రాంతానికి వెళ్లొద్దని హెచ్చరించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రతిఒక్కరూ తెలపాలని సూచించారు. ఆదివారం పెనుబల్లి మండలంలో సంచరించిన పులి మంగళవారం దమ్మపేట మండలానికి చేరుకున్నదన్నారు. అటవీప్రాంతంలో 12 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, పులి కోసం ఎనిమిది బృందాలు గాలిస్తున్నాయన్నారు.